ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. మంత్రి కోమటిరెడ్డి కీలక కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:12 PM

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని.. మరికొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. మాదాపూర్‌లో అసోచాం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సమ్మిట్‌-2024’కు కోమటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేసేలా మౌలిక వసతుల కల్పనకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం స్పీడ్‌ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్, ఎఫెక్టివ్‌ డెలివరీ)గా దూసుకెళుతోందని వ్యాఖ్యనించారు.


ఇందులో భాగంగానే మూసీనది సుందరీకరణ, మెట్రో విస్తరణ, జీహెచ్‌ఎంసీ పునర్‌వ్యవస్థీకరణ, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటు, హైదరాబాద్-సికింద్రాబాద్‌-సైబరాబాద్‌లతో పాటు ఫోర్త్ సిటీ నిర్మాణం, నగరంలో ఎలివేటెడ్‌ కారిడార్లు, రీజనల్‌ రింగ్‌రోడ్డు , ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్, హైకోర్టు భవన నిర్మాణం, ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణం వంటి 19 ప్రాజెక్టులను తాము చేపట్టినట్లు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పైనా కీలక కామెంట్స్ చేశారు. జీహెచ్‌ఎంసీని 4 కార్పొరేషన్లుగా విభజించి ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. మూసీ ప్రక్షాళన చేస్తామని చెబుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జైకా నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకుందని అన్నారు. అధికారం పోగానే ఇప్పుడు మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.


మూసీ నది సమీపంలో నివసించే ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే దానిపై బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయటం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడే రాజకీయాలు ప్రజలకు తీవ్ర నష్టం చేస్తాయని వ్యాఖ్యనించారు. హైదరాబాద్‌ నగరం దశ-దిశను మార్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నగరంలో కొత్త రోడ్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, కొత్త లింకురోడ్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. పట్టణప్రాంతాల్లో ఘనవ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు కొత్త సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మించనున్నట్లు చెప్పారు.


హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ఇప్పటికే తమ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకెళుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో పర్యావరణ సుస్థిరతను మెరుగుపరిచేందుకు వరల్డ్ బ్యాంకుతో కలిసి ‘నెట్‌జీరో ఎమిషన్స్‌’ లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa