తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు తెలియజేస్తే, వారు న్యాయం చేస్తారనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ తమ గోడును పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పుకుంటారు.అయితే దీనిని అవకాశంగా తీసుకుని కొందరు పోలీసులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. ఓ హెడ్ కానిస్టేబుల్ వక్రబుద్ధి చూపాడు. మెల్లగా మాటలు కలిపి ఆమెతో పరిచయం పెంచుకుని ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించి, చివరకు ఆ మహిళను బెదిరించి లైంగికదాడికి యత్నించిన ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ వనస్థలిపురం ఠాణా పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే..
వనస్థలిపురం పోలీస్స్టేషన్కు సాహెబ్నగర్ గాయత్రీనగర్ ప్రాంతం నుంచి ఇటీవల డయల్ 100కు ఓ మహిళ కాల్ చేసింది. ఆమె ఫిర్యాదును నోట్ చేసుకున్న పోలీసులు, కేసు పరిశీలనకు వెళ్లారు. వారిలో జగన్గౌడ్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలితో జగన్గౌడ్కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వరకూ దారితీసింది. దీంతో మహిళ తన బంగారాన్ని కుదువపెట్టి డబ్బు తెచ్చి మరీ కానిస్టేబుల్కు ఇచ్చింది. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని వారి మధ్య ముందే ఒప్పందం కుదిరింది. అయితే కానిస్టేబుల్ ఆ డబ్బు ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో బాధితురాలు అతడిని నిలదీసింది.
దీంతో అక్టోబర్ 4వ తేదీన ఇంజాపూర్లో కమాన్ వద్ద తమ తల్లిదండ్రులు ఉన్నారని, వాళ్లిచ్చే డబ్బు ఆమెకు ఇస్తానని నమ్మబలికి ఆమెను కారులో ఇంజాపూర్ వైపు తీసుకెళ్లాడు. అయితే కానిస్టేబుల్ ఓ నిర్జన ప్రదేశంలోకి కారును తీసికెళ్లి, అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అనంతరం వనస్థలిపురం పోలీస్స్టేషన్లో సదరు కీచక కానిస్టేబుల్పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa