ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీ అయ్య లెక్క అందరూ ఉండరు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్.. నెటిజన్ల ఘాటు కామెంట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 06:50 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు హద్దుమీరుతున్నాయి. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకునే క్రమంలో వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల్లా కాకుండా.. సాధారణ ప్రజల్లా అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల నుంచి చీత్కారాలు చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.


"లక్షకోట్ల కాళేశ్వరం డిజైన్ రూపకర్త దేశంలోనే గొప్ప ఇంజనీర్ అయిన నీ అయ్య లెక్క అందరూ ఉండరు కేటీఆర్. ఇంట్లో కూర్చునే లక్ష కోట్లతో కాళేశ్వరం డిజైన్ చేసి 50 వేల కోట్లు కమీషన్ల రూపంలో మింగేసిన మీలా ఉండరు కదా. మాది ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ. నీది ఘడీల పాలన. అడిగేవారు లేరని అందినకాడికి దోచుకుతిన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే గుడ్డలూడదీసి కర్రుతో వాత పెడతరు తెలంగాణ ప్రజలు జర భద్రం." అంటూ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్టు పెట్టారు.


 అయితే.. ఈ ట్వీట్‌లో బీఆర్ఎస్ అధినేతను ఉద్దేశిస్తూ.. ఉపయోగించిన మాటలపై బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులతో పాటు సాధారణ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ చేశారని ఎవరు చెప్పారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి కూడా హుందాగా మాట్లాడటం రాదా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. "'నీ అయ్య' అని మిమ్మల్ని ఎవరైనా అంటే మీకు ఓకే నా సార్? మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరు మాట్లాడేవి అన్ని ప్రజలు చూస్తున్నారు. జర మీ మాట భద్రం. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని జనాలు కూడా అలాగే మాట్లాడడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు." అంటూ మరో నెటిజన్ సున్నితంగా హెచ్చరించాడు.


అయితే... కాంగ్రెస్ నేతల సియోల్ టూర్‌పై కేటీఆర్ తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు. సియోల్‌లో రివర్ ఫ్రంట్ అభివృద్దిని అంచనా వేయడానికి బృందాన్ని పంపినందుకు అభినందనలని.. వారు అద్భుతమైన ఫలితాలతో తిరిగి వస్తారని, 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని సమర్థిస్తారని తాను భావిస్తున్నానంటూ.. కేటీఆర్ సెటైరికలు ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్‌కు కౌంటర్‌గా ఎంపీ చామల కిరణ్ కుమార్ చేసిన పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa