తెలంగాణలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలోని రైతులందరికీ ఆగస్టు 15వ తేదీ వరతు రుణమాఫీ పూర్తి చేస్తామని పదే పదే చెప్పగా.. ఆమేరకు నిధులు కూడా విడుదల చేసింది. అయితే.. ఆగస్టు 15వరకు మూడు దశల్లో రుణమాఫీ ప్రక్రియ చేపట్టగా.. చాలా వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. అయితే.. ఆధార్ కార్డుల్లో తప్పులు, బ్యాంకు ఖాతాల విషయంలో జరిగిన అవకతవకల కారణంగా.. కొంత మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. అయితే.. ఆ పెండింగ్లో ఉన్న అన్నదాతలకు కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.
శనివారం (అక్టోబర్ 26న) రోజున మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క.. రైతు రుణమాఫీపై స్పందించారు. రెండు మూడు నెలల్లోనే.. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేసినట్టు మంత్రి తెలిపారు. పలు సాంకేతిక కారణాల వల్ల సుమారు 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని.. వారికి కూడా దీపావళి పండగ తర్వాత రుణమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. దీపావళి తర్వాత మరో 4 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమకానున్నాయని మంత్రి సీతక్క తెలిపారు.
ఇదిలా ఉంటే.. రుణమాఫీ కానీ రైతులు నిత్యం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ పూర్తి చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఛలో ప్రజా భవన్కు పిలుపునివ్వగా.. రైతు హామీల సాధన దీక్ష పేరుతో బీజేపీ నిరసన చేపట్టింది. మరోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పర్యటనల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రుణమాఫీ సంగతే ఇలా ఉంటే.. రైతు భరోసా మీద కూడా ఇప్పటికీ ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
అయితే.. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. మరి ఈ మంత్రి వర్గ సమావేశంలో.. మూసీ ప్రాజెక్టు, హైడ్రా లాంటి కీలక అంశాలతో పాటు.. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై కూడా చర్చించినున్నట్టు తెలుస్తోంది. అయితే.. రుణమాఫీ కాని వారి జాబితా ఇప్పటికే సిద్ధం చేయగా.. సాంకేతిక కారణాలను కూడా సవరించినట్టు తెలుస్తోంది. దీంతో.. వారందరికీ దీపావళి తర్వాత అకౌంట్లలో డబ్బులు వేయనున్నటు సమాచారం. ఇదే క్రమంలో.. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa