ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.వెయ్యి కోసం స్నేహితుడి దారుణ హత్య.. ముక్కలుగా చేసి కాలువలో పడేశాడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 08:20 PM

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. కలిసి తిరిగేవారు.. పనులకు వెళ్లేవారు. అయితే ఓ 1000 రూపాయలు వారి మధ్య చిచ్చు పెట్టింది. రాత్రి పడుకోవటానికి ఇంటికి వచ్చిన స్నేహితుడు రూ. వెయ్యి దొంగిలించాడని మరో స్నేహితుడు కక్ష పెంచుకున్నాడు. డబ్బులు తీసుకోవటమే కాకుండా తీసులేదని అబద్ధం చెప్పాడని మనసులో పెట్టుకున్నాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కిరాతకంగా చంపేశాడు. అనంతరం క్రూరంగా శరీరాన్ని మూడు భాగాలుగా చేసి ఊరవతల కాలువలో పడేశాడు. నాలుగేళ్ల క్రితం ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా.. న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది. జీవిత ఖైదుతో పాటు రూ.15 వేల ఫైన్ విధించింది.


వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా జిల్లెడ్‌ చౌదరిగూడెం మండలం కాసులాబాద్‌కు చెందిన గంజేటి అంజయ్య(46), తట్టెపల్లి రాజు (35) మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గ్రామంలో చిన్నా చితక పనులకు వెళ్తుండేవారు. కలిసి తిరిగేవారు. అయితే అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లగా కొన్నాళ్ల పాటు అతడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. దీంతో రాజు అప్పుడప్పుడు అంజయ్య ఇంట్లో నిద్రించేవాడు. ఈ క్రమంలో 2020 ఆగస్టు 12న అంజయ్య ఇంట్లో రూ.1,000 కనిపించకుండా పోయాయి. డబ్బులు కనిపించటం లేదని.. తీశావా..? అని అంజయ్య తన స్నేహితుడు రాజును అడిగాడు.


తాను తీయలేదని రాజు బుకాయించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కాసేపు గొడవ పడ్డారు. అనంతరం ఆగస్టు 15న రాజు మరోసారి అంజయ్య ఇంటికి వచ్చాడు. అక్కడే పడుకున్నాడు. అయితే డబ్బులు రాజే తీసి అబద్ధం ఆడుతున్నాడని అంజయ్య మనసులో పెట్టుకున్నాడు. ఆ కోపంతో నిద్రిస్తున్న రాజును కిరాతకంగా చంపేశాడు. అనంతరం రాజు మృతదేహన్ని ముక్కలుగా చేశాడు. మెుత్తం మూడు భాగాలుగా చేసి మూటలో కట్టి ఊరు బయట కాలువలో పడేశాడు.


మర్నాడు ఉదయం కొందరు గ్రామస్తులు రాజు మృతదేహాన్ని గుర్తించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌బాడీని పరిశీలించారు. అనంతరం అంజయ్య మీద అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. రూ. 1000 దొంగిలించినందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. దీంతో అంజయ్యను రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసు విచారణకు రాగా.. అంజయ్యకు జీవిత ఖైదు, రూ.15 వేల ఫైన్ విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa