తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేసింది. మూడు విడతల్లో దాదాపు రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసారు. ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించగా.. సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు సిద్దమైంది. తాజాగా.. రైతులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు.
తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల అన్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం అమల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉపసంఘం నివేదిక రాగానే.. వీలైనంత త్వరలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.
పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.15 వేల నగదును త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు చెప్పారు. మంత్రి ప్రకటనతో అన్నదాతల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.
కాగా, గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం అందించింది. ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఖరీఫ్, రబీ సీజన్ల వారీగా రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున మెుత్తం ఎకరాకు రూ.10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చింది. ఎకరానికి రూ. 15 వేలు రెండు విడతల్లో జమ చేయనున్నారు.
గతంలో ఈ పథకం అమలులో అక్రమాలు జరిగాయని... ఈసారి అలా జరగకుండా పక్కాగా పంట పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల ఇది వరకే ప్రకటించారు. విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని నివేదిక రాగానే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. మొదట ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికి రైతు భరోసా ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa