ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్‌ హెయిర్ కట్ కావాలి.. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల వింత కోరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 07:13 PM

రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులు.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇంటికి దూరంగా ఉంటారు. అయితే వారికి స్కూల్‌లో చదువు.. హాస్టల్‌లో సౌకర్యాలు, వసతులు.. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. వారికి ఏవైనా సమస్యలు ఉంటే తెలుసుకుని తీర్చాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఉన్నతాధికారులు.. హాస్టల్‌లు తనిఖీ చేసి.. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. ఇక హాస్టల్‌లో ఫిర్యాదుల బాక్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే తాజాగా ఓ రెసిడెన్షియల్ స్కూల్‌ హాస్టల్‌లోని ఫిర్యాదుల పెట్టెను ఓపెన్ చేయగా.. అందులో కొన్ని లేఖలు బయటపడ్డాయి. అందులో ఉన్న విద్యార్థుల సమస్యలు, కోరికలు చూసి అధికారులు షాక్ అయ్యారు.


వరంగల్ జిల్లా కలెక్టరేట్ అధికారులు.. ఇటీవల జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్‌ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కంప్లైంట్స్ బాక్స్‌లో విద్యార్థులు వేసిన ఫిర్యాదులను తీసి చదివారు. అయితే అందులో ఉన్న సమస్యలు చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే ఆహారం బాగాలేదనో, స్కూల్‌లో చదువు సరిగా చెప్పడం లేదనో, గ్రౌండ్ సదుపాయం లేదనో అందులో విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకోలేదు. తమకు కటింగ్ సరిగా చేయడం లేదంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. స్కూల్‌లో ఉన్న అందరు విద్యార్థులకు కటింగ్ పూర్తిగా చిన్నగా చేస్తున్నారని కొందరు విద్యార్థులు చెప్పుకొచ్చారు. తమకు హీరో ప్రభాస్ లాంటి హెయిర్ స్టైల్ కావాలంటూ స్టూడెంట్స్ అధికారులకు రాసిన లేఖలో తెలిపారు. అయితే ఇదేంటని స్కూల్ సిబ్బందిని అధికారులు ప్రశ్నించగా.. అందరికీ ఒకే స్టైల్‌లో హెయిర్ కట్ చేస్తున్నామని వివరణ ఇచ్చారు.


ఇక అమ్మాయిల కంప్లైంట్స్ మరో రకంగా ఉన్నాయి. తమకు జుట్టు వేసుకోవాలి అనే నిబంధనను తొలగించి.. వదులుగా వదిలేసేలా చూడాలని కోరారు. అంతటితో ఆగకుండా తమ చేతులకు నచ్చిన ఫ్యాషన్ గాజులు వేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీచర్ల లాగే తమకు కూడా చీరలు కట్టుకోవాలని ఉందని తమ ఆకాంక్షలు వెల్లడించారు. అయితే ఇలాంటి ఫిర్యాదులు ఎవరో కొంత మంది విద్యార్థులు.. జోక్ కోసం రాసినవని భావించిన అధికారులు.. కొందరు పిల్లలను పిలిచి అడిగారు. అందుకు వారు కూడా అలాంటి సమాధానాలే ఇవ్వడంతో.. అక్కడ అందరూ అలాగే ఉన్నారని అధికారులు గుర్తించారు.


ఇక కొన్ని నెలల క్రితం జరిగిన గణేష్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు ఆ రెసిడెన్షియల్ స్కూల్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు ఏర్పాటు చేయాలని కోరినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. కొంతమంది సీనియర్లు తమను వేధిస్తున్నారని మరికొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అయితే ఇదంతా సోషల్‌ మీడియా ప్రభావం అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వారి వద్ద ఫోన్లు లేనప్పటికీ చాలా పాఠశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ల్యాబ్‌లు ఉన్నాయని.. వాటి ద్వారా పిల్లలు సోషల్‌ మీడియాలో లేటెస్ట్‌ ట్రెండ్లను తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. విద్యార్థులు తమ మనసులోని మాటలను చెప్పడం మంచిదేనని.. వాళ్లపై ఏవి ప్రభావం చూపుతున్నాయో అధికారులకు తెలుస్తుందని పాఠశాల పిల్లలతో కలిసి పనిచేసే డెవలప్‌మెంట్‌ ప్రొఫెషనల్‌ కన్సల్టెంట్‌ ఒకరు చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa