ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ మొదలైన 'హైడ్రా' కూల్చివేతలు.. ఈ ఏరియాలోనే, స్థానికుల్లో టెన్షన్ టెన్షన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 07:20 PM

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మెుదలయ్యాయి. గతకొన్ని రోజులుగా కూల్చివేతలకు బ్రేక్ పడగా.. తిరిగి నేడు మళ్లీ మెుదలయ్యాయి. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేతలు చేపట్టారు. రెండు బృందాలుగా విడిపోయిన హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. రాంపల్లి సమీపంలోని రాజ్‌సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీల సాయంతో హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే ఉన్నట్లుండి హైడ్రా అధికారులు, జేసీబీలు రావటంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొని ఉంది. తమ నివాసాలు కూల్చేస్తారేమోనని వారు భయపడుతున్నారు. వారికి హైడ్రా అధికారులు భరోసా ఇచ్చారు. తాము అక్రమ కట్టడాలను మాత్రమే నోటీసులు ఇచ్చి కూలుస్తామని.. అనవసరంగా టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పారు.


ఇక హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పరిశీలించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణపై స్థానికులతో మాట్లాడి చర్చించారు. గతంలో 16 ఎకరాలు ఉన్న బతుకమ్మ కుంట నిర్మాణ వ్యర్థాలు పోసి ఆక్రమించడంతో ప్రస్తుతం 5.15 ఎకరాలకు కుచించుకుపోయిందన్నారు. స్థానికుల విజ్ఞప్తితో చెరువు పునరుద్ధరణ పనులు చేపడతామని రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా కమిషనర్ రాకతో ఆ ప్రాంతంలోని స్థానికులు పెద్ద ఎత్తున ఎక్కడకు చేరుకున్నారు. నివాసాలు కూల్చేస్తారనే భయం తమలో ఉందని స్థానికులు చెప్పగా.. వారికి కమిషనర్ రంగనాథ్ భరోసా ఇచ్చారు.


నివాసాలు, నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లదంటూ వారికి భరోసా నిచ్చారు. బతుకమ్మ కుంటలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని చెప్పారు. కుంటను పునరుద్ధరిస్తామని.. ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దితే మీ నివాసాలకు విలువ పెరుగుతుందని చెప్పారు. కూల్చివేతల చేపడతామనే అపోహ స్థానికుల్లో ఉందని.. దాన్ని తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతమున్న ఐదు ఎకరాల విస్తీర్ణంలోనే పునరుద్ధరణ చేస్తామన్నారు. చెరువులోకి వరద నీరు వచ్చే మార్గాలపై అధికారులతో చర్చిస్తామని రంగనాథ్ వెల్లడించారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని.. ఆక్రమణదారులకు హైడ్రా నోటీసులు వెళ్తూనే ఉంటాయని చెప్పారు. హైడ్రా కమిషనర్‌ రాకతో బతుకమ్మ కుంట పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa