ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 389 కి.మీ. రైలు మార్గంలో 'కవచ్'.. ట్రైన్ ప్రమాదాలకు చెక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 07:45 PM

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో ట్రైన్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్‌లో అయితే దాదాపు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1200 వందల మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు ట్రైన్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రావడం, ఆగి ఉన్న ట్రైన్‌ను వెనక నుంచి మరో ట్రైన్ వచ్చి ఢీకొనడం వల్ల గత రెండు, మూడేళ్లలో దేశంలో పదుల సంఖ్యలో ట్రైన్ ప్రమాదాలు జరిగాయి. ఇయితే తరహా ప్రమాదాల నివారణకు కవచ్‌ వ్యవస్థ సహాయపడుతుంది. ఈ వ్యవస్థ ఉంటే ట్రైన్ ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు.


త్వరలోనే తెలంగాణలో 389 కి.మీ. ట్రైన్ మార్గంలో కవచ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. బల్లార్షా-కాజీపేట- విజయవాడ వరకు మెుత్తం 514 కి.మీ. మేర కవచ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తెలంగాణ పరిధి 378 కి.మీ. వాడి-గుంతకల్లు- రేణిగుంట వరకు మెుత్తం 537 కి.మీ. మేర కవచ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనుండగా.. ఇందులో తెలంగాణ పరిధి 11 కి.మీ ఉండనుంది. తెలంగాణ మీదుగా పలు మార్గాల్లో ప్రధాన ట్రైన్లు నడుస్తుండటంతో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది.


హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రాజధాని, తెలంగాణ, దురంతో, దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి ట్రైన్లు కాజీపేట-బల్లార్షా మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌తో పాటు ఈస్ట్‌కోస్ట్, చార్మినార్, గోదావరి, శాతవాహన, గరీబ్‌రథ్, సింహపురి, కోణార్క్‌, గౌతమి, పద్మావతి, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వంటి ట్రైన్లు కాజీపేట-విజయవాడ మార్గంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గంలో కవచ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ట్రైన్ ప్రమాదాల నివారణకు చెక్ పెట్టొచ్చునని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


ఈ పనుల కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గానికి రూ.84.9 కోట్లు అంచనా వ్యయం. 18 నెలల్లో పనులు పూర్తి చేసి.. 2026 మే వరకు అందుబాటులోకి తీసుకురావాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు భావిస్తున్నారు. కవచ్‌తో పాటు ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను సైతం అదే సమయానికి పూర్తి చేయాలని యోచిస్తున్నారు. కాగా, తెలంగాణలో ప్రస్తుతం సనత్‌నగర్‌-వికారాబాద్‌- కుర్‌గుంట, వికారాబాద్‌-మటల్‌కుంట మార్గాల్లో కవచ్‌ వ్యవస్థ అందుబాటులో ఉంది.


పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్


కవచ్ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే.. ?


కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు ట్రైన్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ పేరుతో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసారి అమలులోకి తీసుకువచ్చారు. ట్రాక్‌లు, లోకోమోటివ్‌లు, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, ఒక కిలోమీటర్ పరిధిలోని ఉన్న ప్రతి రైల్వే స్టేషన్లలో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఈ వ్యవస్థ పని చేస్తుంది. 4జీ ఎల్టీఈ ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సిస్టమ్.. అల్ట్రా-హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది.


ట్రైన్ నడిపే లోకో పైలట్‌ ఏ కారణంతోనైనా బ్రేకులు వేయడం మరిచిపోయి ప్రమాదకరంగా ముందుకు వెళ్తుంటే.. కవచ్‌ ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ పనిచేస్తుంది. లోకో పైలట్‌తో సంబంధం లేకుండా ఆటోమేటిగ్గా బ్రేక్‌లు వాటంతటవే పడతాయి. ఇందుకు ట్రైన్ పట్టాల పొడవునా (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) ట్యాగ్‌ ఏర్పాటు చేస్తారు. టెలికాం టవర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసి.. సిగ్నల్‌ వ్యవస్థతో కనెక్ట్ చేస్తారు. ట్రైన్ ఇంజిన్లకు కూడా ప్రత్యేకమైన పరికరాల్ని బిగిస్తారు. దీంతో ట్రైన్ యాక్సిడెంట్లకు చెక్ పెట్టవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa