ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే పట్నం అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 07:52 PM

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో ఉదయం వాకింగ్ చేస్తున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనలో పట్నం పాత్ర ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోగమోని సురేష్‌.. పట్నం నరేందర్ రెడ్డితో పలుమార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పట్నం ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని కాల్ డేటాని పరిశీలిస్తున్నారు. ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడారు..? ఏం మాట్లాడారు..? లగచర్ల ఘటనపై ఏమైనా మాట్లాడారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్‌ జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఇతర అధికారుల వాహనాలపై రెండ్రోజుల క్రితం (నవంబర్ 11) దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బోగమోని సురేష్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అతడినే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కలెక్టర్‌ను గ్రామానికి తీసుకెళ్లిన సురేష్‌.. గ్రామస్థులను ఉసిగొల్పి దాడికి పాల్పడినట్లు తేల్చారు. దాడి జరగడానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఫోన్ సంభాషణ విషయంపై పట్నం నరేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దాడి చేసిన వారిలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, బాధిత రైతులు ఉన్నారన్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు ఎవరు ఫోన్ చేసినా తాను స్పందించానని చెప్పారు. అంతేగానీ దాడిలో తన ప్రమేయం లేదని అన్నారు.


ఇక ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాడి ఘటనలో 16 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి కొడంగల్‌ కోర్టులో వారిని హాజరుపరిచారు. నిందితులకు మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో వారందరినీ పరిగి సబ్‌జైలుకు తరలించారు. దాడి ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమై.. లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లోని 50 మంది అనుమానితులను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీలు, వీడియోలు పరిశీలించిన తర్వాత.. వారిలో 34 మందికి దాడితో సంబంధం లేదని గుర్తించి విడిచిపెట్టారు. మిగిలిన 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ప్రధాన నిందితుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉండగా.. ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa