ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 రోజులు కనపడకపోవటానికి కారణం అదే.. తన ఆరోగ్యంపై బండి సంజయ్ క్లారిటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 09:17 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రెండు రోజులుగా కనిపించలేదు.. నిన్న (నవంబర్ 16న) బీజేపీ నిర్వహించిన మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. అయితే.. తాను కనిపించకపోవటానికి కారణాన్ని బండి సంజయ్ వెల్లడించారు. కాళ్ల నొప్పితోనే తాను 2 రోజులు కనపడలేదని క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్.. తనపై, బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కాళ్ల నొప్పితో రెండు రోజులు కనిపించకపోతే.. ఇంత రాద్ధాంతం చేయాలా అంటూ బీఆర్ఎస్ శ్రేణులపై బండి సంజయ్ మండిపడ్డారు. లేచినా, పడుకున్నా.. బీఆర్‌ఎస్‌ నేతలకు తానే గుర్తుకువస్తున్నాన్నని.. వాళ్ల సంగతి చెబుదామనే వచ్చినట్టు వివరించారు.


వికారాబాద్ కలెక్టర్ దాడిపై స్పందించిన బండి సంజయ్.. అది దారుణమైన చర్యగా అభివర్ణించారు. అయితే.. కలెక్టర్ మీద దాడి చేసింది రైతులు కాదనీ.. దాడి వెనుక కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పినట్టుగా గుర్తు చేశారు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని తెలిపారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ నటసార్వభౌముడని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ని కలిశారంటూ కీలక ఆరోపణలు చేశారు.


గతంలోనూ కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుని ఇలాగే నీరుగార్చారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగానే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు తెలియకుండానే అంత వ్యవహారం జరిగిందా అని ప్రశ్నించారు. అప్పుడు, ఇప్పుడు సీఎం కేటీఆరే అని చెప్పుకొచ్చారు. దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయి అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ-ఫార్ములా రేసింగ్ కేసు, ధరణి కేసు, జన్వాడ ఫామ్ హౌస్ కేసు, డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.


తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులని.. ఒకటి రేవంత్ రెడ్డి అయితే.. రెండో సీఎం కేటీఆర్ అని బండి సంజయ్ కీలక ఆరోపణలు చేశారు. రేవంత్ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను నిరూపించేందుకు సిద్ధమని.. మీరు రెడీనా అంటూ ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో ఆర్కే పాలన నడుస్తుందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. మూసీ పేరుతో లక్షల కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని ఆరోపించారు. దానికి తాము వ్యతిరేకమన్నారు. పేదల ఇండ్లు కూల్చవద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై స్పందించిన బండి సంజయ్... తాను కేంద్ర మంత్రినని, తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సజావుగా కొనసాగుతుందంటున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగితే ముక్కు నేలకు రాస్తా.. మీరు రేడినా అంటూ మరో సవాల్ విసిరారు. రైతుల సమస్యను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. లగచర్ల ఫార్మసిటీకి కూడా తాము వ్యతిరేకం కాదన్న బండి సంజయ్... రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని బండి సంజయ్ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa