ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో మరో ముందడుగు.. ఐఏఎస్ హరిచందనకు కీలక బాధ్యతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2024, 09:07 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రీజనల్ రింగు రోడ్డు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. హైదరాబాద్ నగరం చుట్టూ ఇప్పటికే ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు.. 40 కిలో మీటర్ల దూరం నుంచి ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఆర్ఆర్ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందని.. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


కాగా.. ఈ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విషయంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు డైరెక్టర్‌‌ను నియమించింది ప్రభుత్వం. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ హరిచందన దాసరిని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.


అయితే.. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో.. ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ రహదారి హోదా లభించింది. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ విషయంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కసర్తతు చోస్తోంది. ఈ క్రమంలోనే.. దక్షిణ భాగానికి కన్సల్టెంట్ నియామకం టెండర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బీకి సర్కార్ అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. కన్సల్టెంట్ టెండర్లు దక్కించుకున్న కంపెనీ.. ఈ ప్రాజెక్టు దక్షిణ భాగానికి డీపీఆర్ సహా సాంకేతిక, ఆర్థిక సిఫార్సులు చేయనుంది.


అయితే.. ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటివరకు పీపీపీ, హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌, బీఓటీ పద్ధతులను పరిశీలించిన రేవంత్ సర్కార్.. తాజాగా ఇన్‌విట్‌ విధానంపై దృష్టి సారించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం నిర్మాణం విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. రహదారి నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను బాండ్ల రూపంలో సేకరించే విధానమే ఇన్‌విట్. ఏ ప్రాజెక్టు కోసం ఈ నిధులను సేకరిస్తున్నారో.. అదే ప్రాజెక్టుకు నిధులను పూర్తిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా ఖర్చు చేస్తే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కూడా వర్తించదని అధికారులు చెబుతున్నారు. సర్కార్ చేపట్టే ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa