ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మెట్రోతో రూ.6 వేల కోట్ల నష్టం.. సెకండ్ ఫేజ్‌‌పై రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2024, 10:54 PM

హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రో రైలు సౌకర్యవంతమైన, సులభతరమైన ప్రయాణాన్ని అందిస్తోంది. రోజూ 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తూ.. తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే హైదరాబాద్ మెదటి దశలో మూడు కారిడాకర్లలో రైళ్లు పరుగులు పెడుతుండగా.. రెండో దశలో భాగంగా మరో ఐదు కారిడార్లలో మెట్రో మార్గాన్ని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కాగా.. ఆయా మార్గాల్లో భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో.. హైదరాబాద్ మెట్రో రెండో దశపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌పై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రెండో దశలో సుమారు 76 కిలో మీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు చాలా సవాళ్లతో కూడుకున్నదని.. మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలేవి ముందుకు రావడం లేదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు.


హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ నిర్మాణంలో ఎల్ అండ్ టీ సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అనుభవంతో ప్రైవేటు సంస్థలు రెండో దశ నిర్మాణానికి ముందుకు రావడానికి భయపడుతున్నాయని తెలిపారు. మెదటి దశ మెట్రో ప్రాజెక్టు వల్ల ఎల్ అండ్ టీ సంస్థకు సుమారు రూ.6000 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. ఏడాదికి రూ.1300 కోట్ల నష్టాన్ని ఎల్ అండ్ టీ సంస్థ భరిస్తోందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు.


మిగతా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయని చెప్పుకొచ్చిన ఎన్వీఎస్ రెడ్డి.. మెట్రో నిర్మాణానికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపడం లేదని వివరించారు. మెట్రోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరం అవుతున్నాయని తెలిపిన ఎన్వీఎస్ రెడ్డి.. ఇందులో 48 శాతం నిధులు జైకా ద్వారా సమకూరుతున్నాయని వెల్లడించారు.


హైదారాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై మంత్రివర్గ ఆమోదం వచ్చిన తర్వాతే కేంద్రానికి సిఫారసులు పంపించామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే మెట్రో రెండో దశ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. హైదరాబాద్ ప్రజల పూర్తి సహకారం ఉంటే రెండో దశ మెట్రో ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయగలమని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa