ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వణికిపోతున్న తెలంగాణ.. కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు, ఈ జాగ్రత్తలు తీసుకోండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 10:05 PM

తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరగింది. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల సెల్సియ్ ఉష్ణోగ్రత నమోదైంది. అసిఫాబాద్ సిర్పూర్‌లో 9.9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.


హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చీకటి పడిందంటే చాలు నగరవాసులు వణికిపోతున్నారు. నగర శివార్లలో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం పూట సూర్యుడు దర్శనమిచ్చే వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. పలు ప్రాంతాల్లో 12 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల వరకు వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈనెల 26 లేదా 27న బంగాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. అప్పటి వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. అయితే హైదరాబాద్ నగరంతో పాటుగా.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నేడు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. పగటి పూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా ఉంటుందని.. రాత్రిపూట 15 డిగ్రీల దిగువకు పడిపోతాయని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, బాలింత మహిళలు, గర్బిణీలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న చలితో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని.. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచిస్తున్నారు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే ఉన్ని దుస్తులు ధరించాలని అంటున్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నందున.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa