సాధారణ సమయాల్లో ఎలా ఉన్నా.. దేవుని మాల ధరించినప్పుడు మాత్రం మనుషులు చాలా నిష్ఠగా ఉంటారు. అది అంజనేయస్వామి మాల అయినా, అయ్యప్పమాల అయినా.. ఇంకే ఎలాంటి దైవానికి సంబంధించిన మాల అయినా ధరించినప్పుడు ఆ దీక్ష తీసుకున్నన్ని రోజులు.. చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. అబద్దాలు చెప్పకూడాదు. ఎవ్వరినీ మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండాలి. నిష్ఠతో ఉండాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ.. నిత్యం ఆ దైవనాస్మరణతో మనసును నింపుకోవాలి. మనసును మలినం లేకుండా చేసి.. మనలోని దైవత్వాన్ని మేల్కోలి.. స్వచ్ఛమైన మనిషిని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ మొత్తం మాలధారణ నియమాల సారం. ఇంత పవిత్రమైన మాలలు ధరించి కూడా చాలా మంది.. నియమాలు పాటించకుండా.. కుంచిత బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. అలా ఓ అయ్యప్పమాలదారణ చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. అక్రమమైన పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
పెద్దపల్లి జిల్లా నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఓంకారం నర్సింగరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. బాధితుని నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నీటి పారుదల విభాగంలో ఓ కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేశారు. ఆ పనులకు సంబంధించిన కొలతలు రికార్డ్ చేసి.. ఫైల్ మూవ్ చేయడానికి ఏఈ నర్సింగరావు ఆ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వటం ఇష్టంలేని బాధిత కాంట్రాక్టర్.. ఏసీబీని ఆశ్రయించాడు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. కాంట్రాక్టర్కు డబ్బు ఇచ్చి ఏఈకి ఇవ్వమని తెలిపారు. పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న సాయిశ్రీ జిరాక్స్ సెంటర్ సమీపంలో.. సోమవారం రోజున ఉదయం 10:45 గంటల ప్రాంతంలో డబ్బులు ఏఈ తీసుకుంటుండగా.. ప్లాన్ ప్రకారం ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి.. కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
సాధారణ రోజుల్లోనే నర్సింగరావు అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు ఉండగా.. గతంలోనూ ఆయన లంచం డిమాండ్ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాగా.. ఇప్పుడు ఆయన పవిత్రమైన అయ్యప్ప మాల ధరించిన కూడా తన పాడు బుద్ధిని పోనిచ్చుకోకపోవటం అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై ప్రత్యేక నిఘా సారించారు. ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ.. అవినీతి తిమింగలాన్ని కటకటాలపాలు చేస్తున్నారు. కాగా.. ఈ నవంబర్ నెలలోనే 21వ తేదీ వరకు ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల దాడులు నిర్వహించి.. అవినీతి అధికారులను పట్టుకోవటం శోచనీయం. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా.. అవినీతి అధికారులు మాత్రం భయం లేకుండా నిస్సిగ్గుగా సామాన్యుల దగ్గర చేయి చాస్తూ.. అక్రమార్జన చేస్తూనే ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa