తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వం ఏమేమి చేసిందో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. ఈ విజయోత్సవాలను రేవంత్ రెడ్డి సర్కార్ వందశాతం వినియోగించుకుంటోంది. ఇదే సమయంలో.. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపించటమే కాకుండా.. ప్రస్తుతం తమ సర్కారుకు ఎలా అడ్డుపడుతుందన్నది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అధికార ప్రతిపక పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో ఫైట్ చాలా టఫ్గానే సాగుతోంది. అయితే.. ఇలాంటి పీక్ టైంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు.
పాలిటిక్స్కు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు శనివారం (నవంబర్ 30న) రోజున ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. "కొన్ని రోజుల పాటు వెల్నెస్ రిట్రీట్కి వెళ్తున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎక్కువగా మిస్సవరని ఆశిస్తున్నాను." అంటూ స్మైల్ ఎమోజీతో ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్పై అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు, మిగతా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
నిత్యం రాజకీయ కార్యక్రమాలతో, విమర్శలతో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్న కేటీఆర్.. కొంత కాలం విశ్రాంతి తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తూ.. ఆయన అభిమానులు, గులాబీ శ్రేణులు కామెంట్లు పెడుతున్నారు. అయితే.. చాలా మంది నెటిజన్లు మాత్రం.. ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటూ ఆరా తీస్తున్నారు.
మరోవైపు.. తన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెస్ట్ తీసుకుని.. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ మధ్యే ఫిల్డ్లోకి దిగారు. ఆమె ఇలా రంగంలోకి దిగారో లేదో ఇప్పుడు కేటీఆర్ వెల్నెస్ అంటూ పాలిటిక్స్కు బ్రేక్ ఇవ్వటం సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇన్నాళ్లు మీటింగ్లు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో సెటైర్లు, కౌంటర్లతో.. రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడిన కేటీఆర్.. ఉన్నట్టుండి ఇలా బ్రేక్ ప్రకటించటం వెనుక అసలు మతలబు ఏంటన్న చర్చ నడుస్తోంది.
అయితే.. రేవంత్ రెడ్డి సర్కారుకు కొంత సమయం ఇచ్చామని.. ప్రజలు వారు చేసిన తప్పేంటో ఇప్పటికే తెలుసుకున్నారని.. ఇక ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామంటూ ఇటీవలే.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయిన వేళ.. ఉన్నట్టుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఇలా బ్రేక్ తీసుకోవటం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీని వెనుకు కేసీఆర్ స్ట్రాటజీ ఏమైనా ఉందా.. లేదా ఇన్నాళ్లు ప్రజల్లో లేని కవితను హైలైట్ చేయటానికి ఏమైనా ప్లాన్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa