ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ, ఈడీ నమోదుచేసిన కేసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ... ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో పసలేదని, గ్రామీణ భాషలో చెప్పాలంటే ఇది ఓ లొట్టపీసు కేసు అని అన్నారు. అలాగే, జనవరి 7న ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుపై తన లాయర్లు నిర్ణయిస్తారని చెప్పారు.
‘‘నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. ఇది నాపై ఆరో ప్రయత్నం.. ముఖ్యమంత్రి రేవంత్కు ఏమీ దొరకడం లేదు.. రూ. 600 కోట్ల అవినీతి సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు’’ అని మాజీ మంత్రి తెలిపారు. న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకుంటే.. వద్దనేది రేవంత్ నిర్ణయమని.. ఇద్దరి నిర్ణయాలపై మంత్రివర్గంలో చర్చ జరగలేదని పేర్కొన్నారు. ‘‘ఈ విషయంలో నాపై కేసు పెడితే.. రేవంత్పై కూడా కేసు పెట్టాలి.. నేను చేసింద తప్పు అయితే.. రేవంత్ చేసింది ఒప్పు ఎలా అవుతుంది ’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
అలాగే, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఉప-ఎన్నికలు రావచ్చని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. అలాగే, రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వంపై రైతుల నుంచి తిరుగుబాటు వస్తోందని అన్నారు. రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. అంతేకాదు, కేసీఆర్ తమ ట్రంప్ కార్డు అని.. ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసన్నారు. తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa