ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో గుండె మంట ఒకటి. అసిడిటీ, ఛాతీలో మంట వంటి లక్షణాలు ఆహారం తిన్న తర్వాత, పడుకునే ముందు తీవ్రంగా వేధిస్తాయి. ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి హార్ట్బర్న్ను పెంచే పానీయాలు, తగ్గించే పానీయాలు ఏంటో చెప్పుకొచ్చారు. గుండె మంట తగ్గించుకోవడానికి ఆయన చెప్పిన సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవి గుండె మంటను పెంచుతాయి
కొన్ని రకాల పానీయాలు అన్నవాహిక కింది భాగంలో ఉండే కండరాన్ని(LES) విశ్రాంతి పొందేలా చేస్తాయి. ఫలితంగా కడుపులోని ఆమ్లం పైకి వచ్చి తీవ్రమైన మంటను కలిగిస్తాయని, వీటిని మానుకోవాలని డాక్టర్ సౌరబ్ సేథి చెబుతున్నారు.
పరగడుపున కాఫీ
ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. రోజులో ఏ సమయంలో అయినా ముఖ్యంగా నిద్ర లేవగానే కాఫీ తాగడం ద్వారా గుండె మంట ఎక్కువ అవుతుంది.
సిట్రస్ పండ్ల రసాలు
నారింజ రసం, నిమ్మ రసం, ద్రాక్ష రసం వంటి సిట్రస్ రసాలు సహజంగానే అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్లత్వం ఇప్పటికే ఇబ్బంది పడుతున్న అన్నవాహిక గోడలకు చిరాకును కలిగిస్తుంది. వీటికి బదులు తక్కువ ఆమ్లత్వం ఉన్న పండ్ల రసాలను ఎంచుకోవడం ఉత్తమం.
కార్బోనేటెడ్ డ్రింక్స్
సోడాలు, ఇతర కూల్ డ్రింక్స్ లాంటి కార్బోనేటెడ్ పానీయాలు కడుపులో గ్యాస్ను నింపుతాయి. ఈ గ్యాస్ ఒత్తిడి కారణంగా యాసిడ్ రిఫ్లక్స్ జరుగుతాయి. ఈ రకమైన పానీయాలు జీర్ణవ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతాయి.
పుదీనా టీ మంచిది కాదు
చాలా మంది జీర్ణక్రియకు పుదీనా మంచిదని భావిస్తారు. కానీ పుదీనా టీ LES కండరాన్ని లూజ్గా మారడాన్ని మరింత తీవ్రం చేస్తుందని డాక్టర్ సేథి వెల్లడించారు.
ఆల్కహాల్ వద్దే వద్దు
మద్యం సేవించడం LES కండరాన్ని బలహీనపరుస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థలో యాసిడ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
ఇవి తాగితే గుండె మంటకు చెక్ పడుతుంది
అల్లం టీ
అల్లంలో సహజంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. చిన్న అల్లం ముక్కతో చేసిన టీ గుండె మంటను అదుపులో ఉంచుతుంది.
చమోమైల్ టీ తాగండి
చమోమైల్ టీ రిలాక్స్గా ఉంచడానికి సహాయపడుతుంది. నిద్రకు ముందు చమోమైల్ టీ తాగడం రాత్రిపూట వచ్చే రిఫ్లక్స్ను తగ్గించవచ్చు.
కొబ్బరి నీరు తీసుకోండి
కొబ్బరి నీరు సహజమైన ఎలక్ట్రోలైట్. దీని pH విలువ సాధారణంగా ఆమ్లతత్వాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది కడుపులోని యాసిడ్ను తగ్గిస్తుంది.
సోంపు నీరు మంచిది
సోంపు గింజలను నీటిలో నానబెట్టి నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa