మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న జెట్ ఇంధన ధరలు మరియు గగనతల ఆంక్షల కారణంగా Air India భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జూలై వరకు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో దాదాపు 100 విమాన సర్వీసులను తగ్గించాలని సంస్థ నిర్ణయించింది.ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ ఉద్యోగులకు పంపిన సందేశంలో ఇప్పటికే ఏప్రిల్, మే నెలల్లో కొన్ని అంతర్జాతీయ సర్వీసులను తగ్గించినట్లు తెలిపారు. పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో జూన్, జూలై నెలల్లో అదనపు కోతలు అవసరమయ్యాయని పేర్కొన్నారు.ప్రస్తుతం ఎయిర్ ఇండియా రోజుకు సుమారు 1,100 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. అయితే యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో కార్యకలాపాలను తగ్గించనుంది. మధ్యప్రాచ్య ఘర్షణల కారణంగా కొన్ని గగనతలాలు మూసివేయబడటంతో, విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన వినియోగం కూడా భారీగా పెరిగింది.అంతర్జాతీయంగా జెట్ ఇంధన ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 24తో ముగిసిన వారంలో ప్రపంచ సగటు జెట్ ఇంధన ధర బ్యారెల్కు 179.46 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి చివర్లో ఇది 99.40 డాలర్లుగా ఉండగా, కేవలం కొన్ని వారాల్లోనే దాదాపు 80 శాతం పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోంది.మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎయిర్ ఇండియా గ్రూప్ సుమారు రూ.22,000 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు, కార్యకలాపాలను స్థిరీకరించేందుకు విమాన సర్వీసుల కోత తప్పనిసరి అయిందని సంస్థ భావిస్తోంది. ప్రయాణికులు, ఉద్యోగులకు కలిగిన అసౌకర్యంపై కంపెనీ విచారం వ్యక్తం చేసింది.మధ్యప్రాచ్య పరిస్థితులు త్వరలో సాధారణ స్థితికి చేరి, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి తిరిగి పూర్తిగా తెరుచుకుంటే కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa