ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 08:15 PM

తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి సర్కార్.. శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం పెట్టటమే కాకుండా.. ఇప్పటికే గ్రామాల్లో సర్వే కూడా మొదలైంది. ఈ క్రమంలో.. ఓ వార్త వైరల్ అవుతూ.. జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. కుటుంబంలో ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు వస్తే.. ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డును తొలగిస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఈ వార్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు.


జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొన్న మంత్రి పొన్నం.. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని స్పష్టత ఇచ్చారు. అర్హత ఉండి రేషన్ కార్డులు లేని వారికి జనవరి 26 నుంచి కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ విషయంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే.. సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వొచ్చని.. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డుల గురించి చర్చ కాదన్నారు. గత పదేళ్లుగా రేషన్ కార్డులు లేకుండా.. కొత్తగా పెళ్లి అయిన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త చెబుతున్నామన్నారు. అర్హత ఉన్న వారికి జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.


పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని.. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే నమ్మొద్దని చెప్పుకొచ్చారు. కుల సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారంతో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇందుర్తిలో 71 కొత్త రేషన్ కార్డులు వచ్చాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తున్నాయన్నారు. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశామని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.. రైతు భరోసా పథకం కింద.. రూ.12 వేల పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుందన్నారు. ఇక.. భూమి లేని రైతు కూలీలకు కూడా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com