ఉన్నత చదువుల కోసమని ఖండాలు దాటి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు చాలా మంది.. తాము అనుకున్న లక్ష్యాలను చేరుతూ కన్నవారికి పుట్టిన ఊరికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అయితే.. కొంతమంది విద్యార్థులు మాత్రం రకరకాల కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆయా దేశాల్లో దుండగులు జరిపే కాల్పులకు కొంతమంది అమాయక విద్యార్థులు బలవుతుంటే.. మరికొందరు హత్యలకు గురవుతున్నారు. ఇంకొంత మంది రకరకాల భయాలతో దేశం కాని దేశంలో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటూ.. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఈ క్రమంలో మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాలోని న్యూయార్క్కు వెళ్లిన సాయికుమార్ రెడ్డి అనే తెలుగు విద్యార్థి.. ఆత్మహత్య చేసుకున్నాడు. అటు చదువుకుంటూనే.. న్యూయార్క్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు సాయికుమార్. అయితే.. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ను సీజ్ చేశారు. దీంతో.. ఆందోళనకు గురైన యువకుడు తనను ఏం చేస్తారో.. ఇంటికి వెళ్లలేనేమో.. అన్న భయంతో కఠిన నిర్ణయం తీసుకుంది. క్షణికావేశంలో తాను పార్ట్ జాబ్ చేస్తున్న ఆఫీసులోనే సూసైడ్ చేసుకున్నాడు.
సాయికుమార్ ఆత్మహత్య గురించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందకపోవటంతో.. సాయికుమార్తో ఉంటున్న స్నేహితులు అమెరికా నుంచి తెలుగు మీడియా ఛానళ్లకు సమాచారం అందించారు. తమ దగ్గర సాయికుమార్ కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో ఆత్మహత్య విషయం వారికి చేరవేయలేకపోయినట్టు చెబుతున్నారు.
అయితే.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. అమెరికాలోకి వచ్చిన అక్రమ వలసదారుల పట్ల తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. అక్రమవలసదారులను దారుణంగా సంకేళ్లేసి స్వదేశాలకు పంపిస్తున్న ఘటనలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే.. 2 రోజుల క్రితం అమెరికా నుంచి వంద మందికిపైగా భారతీయులను అమృత్సర్కు తిప్పి పంపించారు. అయితే మరో 18 వేల మంది భారతీయులను అక్రమవలసదారులుగా గుర్తించినట్టు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో సాయికుమార్ రెడ్డి పాస్పోర్ట్ సీజ్ కావటం, దోషుల్లా సంకెళ్లేసి బలవంతంగా భారత్కు తిప్పి పంపిస్తున్న సంఘటనలు ప్రసారమవుతుండటంతో.. తనను కూడా అలాగే పంపించేస్తారేమోనన్న భయంతో.. సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు స్నేహితులు చెబుతున్నారు. అయితే.. సాయికుమార్ రెడ్డి ఎక్కడి వాస్తవ్యుడు, ఆయన కుటుంబ వివరాలేంటీ..? అన్న వివరాలు తెలియాల్సింది. సాయికుమార్ రెడ్డి ఫోన్ లాక్ చేసి ఉండటంతో.. వ్యకిగత సమాచారం తెలియడం లేదని స్నేహితులు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. తెలుగు విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని, ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుని కష్టపడి అమెరికా వెళ్తే.. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. పార్ట్టైమ్ జాబ్స్ లేక.. ఎప్పుడు ఎవరిని తిప్పి పంపిస్తారో తెలియక.. తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa