హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చెర్ల గ్రామం జిల్లా కేంద్రం నుంచి 15 కి.మీ దూరంలో ఉంటుంది. ఆ గ్రామ మెుత్తం జనాభా 500. అయితే ఆ గ్రామ ప్రజలందరూ సామాజిక స్పృహ కలిగినవారే. తాము చనిపోయినా.. మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని మరణానంతరం తమ కళ్లను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మానవతా హృదయంతో సాధ్యమైనన్ని జీవితాలలో చీకటిని పారదోలే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన దాదాపు 70 మంది ఇప్పటికే తమ కళ్లను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ నిర్ణయం అవయవదానం పొందిన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తే.. మరణం తర్వాత కూడా ఒకరికి జీవితం ఇవ్వొచ్చుననే ఆలోచనను సమాజంలో రేకెత్తిస్తోంది.
గ్రామానికి చెందిన మండల రవీందర్ ఈ మంచి పనికి తొలి అడుగు వేశారు. నీటి పారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న రవీందర్.. పదేండ్ల క్రితం తన తల్లిని కోల్పోయారు. ఆమె రెండు కండ్లనూ అవసరమైన వారికి దానం చేయడం ద్వారా.. తల్లి జ్ఞాపకాలను పదిలం చేసుకోవచ్చునని అనుకున్నారు. ఆ తర్వాత 2019లో తన తండ్రి కళ్లను కూడా దానం చేశారు. అక్కడితో ఆగిపోకుండా అవయవదానంపై.. ప్రత్యేకించి నేత్రదానంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. రవీందర్తో కలిసి నడవడానికి గ్రామస్థులు సిద్ధపడ్డారు. ఆయన సూచన మేరకు నేత్రందానం చేసేందుకు ముందుకొచ్చారు.
ఇప్పటి వరకు గ్రామానికి చెందిన 70 మంది తమ నేత్రాలను దానం చేశారు. ముచ్చర్ల గ్రామం స్పూర్తితో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 20 మంది తమ కళ్లను దానం చేశారు. ఈ ప్రాంతంలో ఎవరు చనిపోయినా.. వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలోని నేత్రనిధి సభ్యులకు సమాచారం అందిస్తారు. వారు వచ్చి నేత్రాలను సేకరించి నేత్రనిధికి పంపుతారు. ఎవరైనా వ్యక్తి చనిపోయిన ఆరు నుంచి ఎనిమిది గంటల్లోపు కళ్లలోని కార్నియాను సేకరించాల్సి ఉంటుంది. అలా సేకరించిన కార్నియాను హైదారాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ తరలిస్తారు. అక్కడ అవసరమైన వారికి వాటిని అమర్చుతారు.
ఇలా చూపులేని వారికి చూపును ప్రసాదించి.. తమ వారు చనిపోయినా ప్రపంచాన్ని చూసేలా చేస్తున్నారు ముచ్చర్ల గ్రామస్తులు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్నియా దెబ్బతిని చూపు కోల్పోతున్నారని.. అలాంటివారికి మళ్లీ చూపు తెప్పించి, లోకాన్ని చూపించడంలో ఎంతో సంతృప్తి ఉందని అంటున్నారు. నేత్రదానంతో తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ముచ్చర్ల గ్రామం ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా 'ఎక్సలెన్స్ ఇన్ ఐ డొనేషన్' అవార్డును అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa