తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు జోరుగా నడుస్తున్నాయి. అయితే.. రాజకీయమైన విమర్శల కంటే.. తిట్ల దండకాలే ఎక్కువగా ఉంటుండటం శోచనీయం. అయితే.. రాజకీయాల్లో నేతలు మాట్లాడుతున్న బాషపై సామాన్య ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటే.. ప్రస్తుత పరిస్థితులు.. ఎంత తిడితే అంత ఫాలోయింగ్ అనుకునేలా మారిపోతున్నాయి. కాగా.. ఈ అంశంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో స్పందించారు.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరు చెప్పి కొందరు దుర్భాషలాడుతున్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇలాంటి దుర్భాషను ఎక్కడ నేర్చుకున్నారని.. పక్కనున్న ఏపీ నుంచి నేర్చుకున్నారా అంటూ కూనంనేని మండిపడ్డారు. ఇలాంటి భాష ఎవరు వాడినా తప్పేనని.. రాజకీయ నాయకులు అంటే ఎన్ని తిట్టినా పడతారు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నేతలను ఎన్ని తిట్టినా ఏమి చేయలేరనే అలసత్వం పెరిగిందా అని దుయ్యబట్టారు. ఈ విద్వేషకరమైన భాషను మాట్లాడే పద్ధతిని ఎక్కడున్నా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కూనంనేని అభిప్రాయపడ్డారు.
గతంలో ఇలాంటి భాష లేదన్న కూనంనేని.. రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచే ఈ సంప్రదాయం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి.. అందరి సలహాలు తీసుకొని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎలా పడుతున్నారో తెలియదు కానీ.. తమ మీద చిన్న ఆరోపణ వచ్చినా తట్టుకోలేకపోతున్నామని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఒక్క రాజకీయ నాయకులలోనే కాదని.. జర్నిలిజంలో కూడా ఉందని కూనంనేని చెప్పుకొచ్చారు. తన జీవితం కూడా జర్నలిజం నుంచే మొదలైందని.. కానీ అలాంటి భాష వాడేవాళ్లం కాదని తెలిపారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సహా నాయకులంతా ఒక రోజు సమయం కేటాయించి పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రైతుల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోందని కూనంనేని చెప్పుకొచ్చారు. చిన్న ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వస్తున్నాయని.. కానీ అది చిరు ఉద్యోగులకు అందడం లేదన్నారు. వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దయచేసి వారికి కూడా సమయానికి జీతాలు చెల్లించాలని కూనంనేని కోరారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం విమానాశ్రయం గురించి కూడా కూనంనేని స్పందించారు. కొత్తగూడెం ఎయిర్ పోర్టు ప్రతిపాదన కూడా ఎన్నో ఎళ్లుగా ఉందని తెలిపారు. కొత్తగూడెం, రామగుండంలో విమానాశ్రయాల ఏర్పాటును ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. అయితే.. కొత్త విమానాశ్రయాలు రాకుండా ఎవరో కుట్ర ప్రన్నుతున్నారని తాను విన్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa