నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 22న ఉదయం 8:30 గంటల సమయంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ తో పనులు జరుగుతుండగా టన్నెల్ పైకప్పు కూలిపోయింది. టన్నెల్ నుంచి 14 కిలోమీటర్ల వద్ద షియర్ జోన్ అని పిలిచే భాగంలో ఈ ఘటన జరిగింది. ఆసమయంలో 50 మంది కార్మికులు లోపల ఉండగా.. 42 మంది బయటకు రాగలిగారు, కానీ 8 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు టెక్నికల్ సిబ్బంది, నలుగురు కార్మికులు ఉన్నారు.
దీంతో భారత ఆర్మీ, నౌకాదళం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్లు, అలాగే ఉత్తరాఖండ్ ర్యాట్ హోల్ మైనర్స్ నిపుణులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. మార్చి 9న పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం శిథిలాల నుంచి వెలికితీశారు. మార్చి 25న ప్రాజెక్ట్ ఇంజినీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 43 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రైల్వే, సింగరేణి, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోబోల ద్వారా సహాయం అందించే ప్రయత్నం విఫలం కావడంతో పొక్లెయిన్లతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సొరంగంలో 13.730 కిలోమీటర్ల నుండి 13.884 కిలోమీటర్ల మధ్య 10 అడుగుల ఎత్తులో రాళ్లు, మట్టి పేరుకుపోయింది. దీనిని తొలగించడానికి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదు. 13.936 కి.మీ వద్ద ఉన్న డి1 ప్రాంతంలో 20 మీటర్ల వరకు సిబ్బంది వెళ్లడానికి వీలు లేదు. ఇది ప్రమాదకర ప్రాంతంగా గుర్తించబడింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కన్వేయర్ బెల్టుపై మట్టిని, వ్యర్థాలను బయటకు పంపుతున్నారు. టన్నెల్లో ఐదు పొక్లెయిన్ల ద్వారా సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి.
ఆరుగురి అవశేషాలు దొరుకుతాయా..?సహాయక బృందాల ఉన్నతాధికారులు టన్నెల్ ముఖద్వారం వద్ద శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ ప్రత్యేకాధికారి శివశంకర్ మాట్లాడుతూ.. మట్టిలో చిక్కుకున్న ఆరుగురి అవశేషాలను గుర్తించడమే లక్ష్యంగా సహాయక చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రారంభంలో టన్నెల్లో సహాయక చర్యల కోసం రోబోలను ఉపయోగించాలని భావించారు. అయితేసాంకేతిక సమస్యల కారణంగా రోబోల పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. మూడు రోజుల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాటిని వెనక్కి పంపించారు. ప్రస్తుతం పొక్లెయిన్స్ మరియు సిబ్బంది మాత్రమే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే వారి అవశేషాలు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa