ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టుపై విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 04:05 PM

సుప్రీంకోర్టుపై బీజేపీ నేతల దాడి కొనసాగుతోంది. ఆ పార్టీ ఎంపీలు నిషికాంత్ దూబే, దినేశ్ శర్మ చేసిన సంచలన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నిషికాంత్ దూబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వాటిని సమర్థించడం కానీ, అంగీకరించడం కానీ చేయబోం. వారి వ్యాఖ్యలను పార్టీ పూర్తిగా ఖండిస్తోంది’’ అని నడ్డా ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలిపారు. న్యాయ వ్యవస్థను బీజేపీ గౌరవిస్తుందని నడ్డా పునరుద్ఘాటించారు. భారత ప్రజాస్వామ్య నిర్మాణంలో అది అంతర్గత భాగమని నడ్డా చెప్పారు. భారత రాజ్యంగాన్ని కాపాడటంలో అవి బలమైన పునాదులని వివరించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటుతో పనేముందని, దానిని మూసుకోవడం మేలని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, దేశంలో పౌరయుద్ధం సంభవిస్తే అందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ మాట్లాడుతూ.. పార్లమెంటును కానీ, రాష్ట్రపతిని కానీ ఎవరూ ఆదేశించలేరని పేర్కొన్నారు. ‘‘భారత రాజ్యాంగం ప్రకారం.. లోక్‌సభను కానీ, రాజ్యసభను కానీ, అధ్యక్షుడిని కానీ ఎవరూ నిర్దేశించలేరు. ఎందుకంటే రాష్ట్రపతే సుప్రీం’’ అని శర్మ పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా న్యాయవ్యవస్థపై విరుచుకుపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa