తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో గొడవలు ఎక్కువయ్యాయి. టిక్కెట్టు డబ్బులు ఇవ్వలేదని, తను ఆపుకున్న సీట్లో ఇంకెవరో కూర్చొన్నారని, బస్సు ఆపలేదని, చేయి తాకిందని, కాలు తాకిందని, తోసుకుంటూ వెళ్లారని తరచుగా ఇలాంటి గొడవలు కనిపిస్తుంటాయి. బస్టాప్లలో డ్రైవర్లు బస్సులు ఆపకుండా వెళుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్లో ఇలాంటి ఘటనే జరిగింది. బస్సు ఎక్కబోతూ తాను కింద పడినా, బస్సు ఆపకుండా వెళ్లాడంటూ ఓ మహిళ.. బస్సు డ్రైవర్, కండక్టర్తో వాగ్వాదానికి దిగారు. ఏకంగా 10 కిలోమీటర్లు దూరం బస్సును ఛేజ్ చేసి, అడ్డగించి కండక్టర్, డ్రైవర్ను నిలదీశారు.
ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద ఆ మహిళ ప్రతి రోజూ బస్సు ఎక్కుతున్నారట. ఎప్పటిలాగే ఈ రోజు కూడా తన పిల్లలతో కలిసి బస్సు ఎక్కేందుకు వచ్చారు. అయితే, తాను బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే.. డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లారని, తన పిల్లలు కిందే ఉన్నారని ఆ మహిళ ఆరోపించారు. దీంతో తాను పిల్లల కోసం తిరిగి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తుండగా.. బస్సు ముందుకు కదలడంతో పడిపోయానని ఆమె చెప్పారు. బస్సు డ్రైవర్ మాత్రం తాను పడిపోయినా ఆపకుండా బస్సును అలాగే ముందుకు తీసుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను కిందపడి గాయాల పాలైతే పరిస్థితి ఏంటని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దిగాల్సిన వాళ్లు దిగి, ఎక్కాల్సిన వాళ్లు బస్సు ఎక్కేవరకు చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్, కండక్టర్కు లేదా అని ఆమె నిలదీశారు. బస్సు కండక్టర్, డ్రైవర్ మాత్రం ఆ మహిళదే తప్పు అని వాదిస్తున్నారు. బస్సు కదిలిన తర్వాత కిందకు దిగారని చెబుతున్నారు. రివర్స్లో తమనే కోప్పడుతోందని ఆరోపించారు. ప్రతి స్టాప్లో ఎంతో మంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ప్రతి ఒక్కరినీ గమనించాలంటే సాధ్యమా అని వారు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. టీడీఎస్ఆర్టీసీ కొత్తగా మెట్రో కాంబి టికెట్ను ప్రవేశపెట్టింది. సాధారణ బస్సు టికెట్ లేదా నెలవారీ పాస్ ఉన్నవారు రూ.20 అదనంగా చెల్లించి మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యాన్ని తీసుకువచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa