ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని కన్నుమూత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 08:34 PM

తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (ఎం.జి. ప్రియదర్శిని) ఆదివారం (మార్చి 04న) రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఉదయం 10.15 గంటలకు జస్టిస్ ప్రియదర్శిని మరణించారు. న్యాయమూర్తి ప్రియదర్శిని హఠాన్మరణం పట్ల న్యాయవాద వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతికి పలువురు న్యాయవాదులు, న్యాయమూర్తులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని అంత్యక్రియలు సోమవారం (మార్చి 05న) రోజు ఉదయం హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.


జస్టిస్ ప్రియదర్శిని తన విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండేవారని, కేసులను లోతుగా పరిశీలించి న్యాయమైన తీర్పులు వెలువరించేవారని పలువురు న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం తెలంగాణ న్యాయవ్యవస్థకు తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ మాటురి గిరిజా ప్రియదర్శిని తన విధి నిర్వహణలో నిబద్ధత, న్యాయ సూత్రాల పట్ల గౌరవంతో వ్యవహరించేవారని న్యాయవాద వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి.


జస్టిస్ మాటురి గిరిజా ప్రియదర్శిని ఆగస్టు 30న విశాఖపట్నంలో జన్మించారు. జస్టిస్ ప్రియదర్శిని తండ్రి శ్రీ మాటురి అప్పారావు తెలంగాణ ప్రాంతంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేశారు. తల్లి శ్రీమతి నాగారత్నం గృహిణి. ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఆమె డాక్టర్ కె. విజయ్ కుమార్‌తో వివాహం చేసుకున్నారు. వారికి నిఖిల్, అఖిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహమైన తర్వాత కూడా జస్టిస్ మాటురి గిరిజా ప్రియదర్శిని తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలు పొందారు. అనంతరం, 1995లో విశాఖపట్నంలోని ఎన్.బి.ఎం లా కాలేజీ నుంచి మూడేళ్ల న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. 1997లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లాలో ఎల్.ఎల్.ఎం పూర్తి చేశారు. ఆమె రాజ్యాంగ చట్టంలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు.


 


 


సెప్టెంబర్ 1995లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. న్యాయవాదిగా చేరిన తర్వాత, శ్రీమతి పి. ఉమాబాల కార్యాలయంలో దాదాపు 7 సంవత్సరాలు పనిచేశారు. విశాఖపట్నంలో 10 సంవత్సరాలకు పైగా క్రియాశీల న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సివిల్, క్రిమినల్, కార్మిక చట్టం, వైవాహిక సంబంధిత కేసులతో పాటు విశాఖపట్నం జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా సూచించబడిన ఉచిత న్యాయ సహాయ కేసులను కూడా ఆమె వాదించారు.


ఆ తర్వాత, ప్రత్యక్ష నియామకం ద్వారా జిల్లా జడ్జిగా ఎంపికై 03-11-2008న అదనపు జిల్లా జడ్జిగా న్యాయశాఖలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఆగస్టు 2016 నుంచి డిసెంబర్ 2018 వరకు ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, జనవరి 2019 నుంచి అక్టోబర్ 2020 వరకు ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, అక్టోబర్ 2020 నుంచి మార్చి 2022 వరకు కరీంనగర్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె 24-03-2022న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa