ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో సాగుతున్న ప్రయాణాన్ని ముంబయి లోకల్ ట్రైన్ జర్నీతో పోల్చారు. సొంత నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు హిందీ భాష, తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్పై, నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పవన్ కల్యాణ్ ప్రయాణాన్ని ముంబయి లోకల్ ట్రైన్ జర్నీతో పోల్చారు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ తన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ ఓ పాడ్కాస్ట్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘పవన్ కల్యాణ్కు తెలియదు. బీజేపీ వాళ్లు ఎక్కించేశారు. ఎప్పుడో వాళ్లే దింపుతారు. ముంబయిలో ట్రైన్ మనం ఎక్కాల్సిన పనిలేదు. అక్కడ నిలబడితే ఎవరో ఒకరు ఎక్కించేస్తారు. మళ్లీ దించేస్తారు. అలాగే పవన్ కల్యాణ్ పరిస్థితి ఉంది. ఎందుకు ఎక్కాను, ఎక్కడ దిగాను అనేది ఆయనకు తెలియదు. పవన్ తన సొంత నియోజవర్గ సమస్యలు పట్టించుకోకుండా.. మహారాష్ట్రలో అలా ఉంది, తమిళనాడులో ఇలా ఉంది, బెంగాల్ అలా ఉందని మట్లాడుతున్నారు’ అంటూ జనసేన అధినేత గురించి ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు.
‘‘వాళ్లు నిన్ను వాడుకుంటున్నారు. వాళ్ల గన్ నీ భుజం మీద పెట్టుకొని షూట్ చేస్తున్నారు. నువ్వేదో గన్ నువ్వే భుజం మీద పెట్టుకున్నా అనుకుంటున్నావ్. బీజేపీ, ఆరెస్సెస్ నీ భుజం మీద చేయి వేస్తే.. నిన్ను వాడుకొని వాళ్లు పైకి ఎక్కడానికి గానీ.. నీ కోసం కాదు. ఈ కొద్ది టైం నువ్వు ఎంజాయ్ చేస్తావ్’’ అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కు హితబోధ చేసే ప్రయత్నం చేశారు.
పవన్ కళ్యాణ్తో పర్సనల్గా తనకు ఎలాంటి సమస్య లేదన్న ప్రకాష్ రాజ్.. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. నిలడకలేని ఆయన వైఖరి కారణంగానే సమస్య వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్కు పేర్లు తెలిస్తే సరిపోదని.. వ్యక్తుల గురించి తెలియాలన్నారు. పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోరు.. ఆయనకు తెలీదు. అన్నీ తెలుసని ఆయనకు మీరు ఆపాదిస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ అంటే బీజేపీని మాత్రమే చూడొద్దన్న ప్రకాష్ రాజ్.. ఆరెస్సెస్, జన్సంఘ్ను కూడా కలిపి చూడాలన్నారు. పటేల్ ఆరెస్సెస్ను బ్యాన్ చేస్తే.. జనాల్లోకి వెళ్లలేక వారు వేరే పేరు పెట్టుకున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఆరెస్సెస్కు బీజేపీ మరో వింగ్ మాత్రమేనన్నారు. బీజేపీకి 240 సీట్లు వచ్చినప్పటికీ.. దాని వాస్తవ బలం 160 సీట్లు మాత్రమేనన్నారు.
హిట్లర్, నెపోలియన్ లాంటి దొంగలు ఎక్కువ రోజులు ఉన్న చరిత్ర లేదన్న ప్రకాష్ రాజ్.. కాంగ్రెస్లో ఉన్న సగం దొంగలు బీజేపీలో ఉన్నారన్నారు. 15 ఏళ్లు నేను అధికారంలో ఉంటాననేది అహంకారమేనన్న ప్రకాష్ రాజ్.. ఎన్నికల్లో ప్రతిపక్షం గెలవదు.. రూలింగ్ పార్టీ ఓడిపోతుందన్నారు. ఇప్పుడు ఓడిపోయే ఛాన్స్ మీది అన్నారు.
డబ్బింగ్ సినిమాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘తెలుగు సినిమాను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నామంటే.. వాళ్ల భాషను మనం గౌరవిస్తున్నామని, అదొక వ్యాపారం. మా భాషను మీ మీద రుద్దడం లేదనే కోణంలో చూడాలి. ఛత్తీస్గఢ్, బెంగాల్, యూపీ నుంచి మన దగ్గరికి వస్తున్న వాళ్లను మన భాషలను నేర్చుకోమని చెప్పండి. అంతే కానీ మనం వాళ్ల భాషలు నేర్చుకోలేం కదా. బీజేపీ వాళ్లు రాసి ఇచ్చింది పవన్ మాట్లాడేస్తారా?’ అని ప్రకాష్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
తమిళులు భాష కోసం ఎలా పోరాటం చేస్తున్నారో చూడండి అంటూ కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడారన్న ప్రకాష్ రాజ్.. ఇప్పుడు పవన్ ఇలా మాట్లాడటం ఏంటన్నారు. నిజాలు గుర్తుంటాయ్, అబద్ధాలు మర్చిపోతామన్నారు. పవన్కు మెమొరీ ప్రాబ్లం ఉందన్న ప్రకాష్ రాజ్.. మాతృభాష గురించి మాట్లాడితే.. ఎంత పెద్ద ఫ్యాన్ అయినా ఎందుకు వింటానని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa