హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా వలయాన్ని అధికారులు మరింత పటిష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం బలగాల నిఘాను మరింత పెంచారు. ఇరవై నాలుగు గంటల పాటు విమానాశ్రయ కార్యకలాపాలను డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్ వర్గాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో నిరంతర సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. విమానాశ్రయం లోపల, వెలుపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు.ఈ నేపథ్యంలో, విమాన ప్రయాణికులకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ప్రయాణం చేయదలచిన వారు తమ విమానం బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని కోరారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అందిన స్పష్టమైన ఆదేశాల మేరకు ప్రయాణికులను, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉత్తర భారతదేశంలోని కొన్ని కీలక నగరాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. వీటిలో శ్రీనగర్, అమృత్సర్, జోధ్పుర్, చండీగఢ్, రాజ్కోట్లకు వెళ్లే విమానాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa