9నల్గొండ జిల్లాకు చెందిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి (కేజీబీవీ) విద్యార్థిని తొలిసారిగా విమానం ఎక్కనుంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు పదో తరగతి పరీక్షల ముందు జిల్లా ఇలా త్రిపాఠి కేజీబీవీ విద్యార్థినులకు ఓ హామీ ఇచ్చారు. టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిని తన సొంత ఖర్చులతో విమానంలో పంపిస్తానని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఇటీవల విడుదలైన టెన్త్ పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన మడుగులపల్లి KGBVకి చెందిన పుట్ల ప్రసన్న అనే విద్యార్థినికి విమాన టికెట్ అందించారు.
మే 17న విద్యార్థిని తొలిసారిగా విమానం ఎక్కి విశాఖపట్నం వెళ్లనుంది. అక్కడ మూడు రోజుల పాటు గడపనుంది. కాగా, ప్రసన్న 600 మార్కులకు గాను 563 మార్కులు సాధించి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్నను అభినందించారు. టెన్త్ పరీక్షలకు ముందు కనగల్లోని KGBV పాఠశాలను సందర్శించినప్పుడు కలెక్టర్ ఈ హామీ ఇచ్చారు. కేజీబీవీల్లో చదివే విద్యార్థినులను ప్రోత్సహించడానికి పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి విమాన టికెట్ ఫ్రీగా స్పాన్సర్ ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ప్రసన్నతో పాటు మడుగులపల్లి కేజీబీవీ ప్రత్యేక అధికారి కె. సునీత కూడా విశాఖ వెళ్లనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కలెక్టరే స్వయంగా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని అన్నారు. దీనివల్ల మిగతా విద్యార్థులు కూడా కష్టపడి చదవడానికి ప్రేరణ పొందుతారని చెప్పారు. ప్రసన్న చాలా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించిందని అభినందించారు. ప్రసన్నకు విమాన ప్రయాణం ఒక మంచి అనుభూతిని ఇస్తుందన్నారు.
ఇదిలా ఉండగా.. యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు గురువారం (మే 8) సంస్థాన్ నారాయణపూర్ ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల వార్డెన్ను ఘనంగా సన్మానించారు. ఆ పాఠశాల పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించినందుకు, 95 శాతం మార్కులు సాధించిన హాస్టల్ విద్యార్థికి మార్గనిర్దేశం చేసినందుకు ఆయనను అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa