5తెలంగాణ సర్కార్ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మెరుగైన సేవలు అందించడమే కాక.. కాస్మోటిక్ ఛార్జీలను కూడా నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మంగళవారం సచివాలయంలో.. సీఎస్ సీఎస్ కె.రామాకృష్ణారావు.. రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సీఎస్ కె.రామాకృష్ణారావు అధికారులను ఆదేశించారు. అంతేకాక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం, చక్కటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని.. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం సచివాలయంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
అంతేకాక రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా నాణ్యమైన సరుకులు, విద్యార్థులకు టెక్స్ బుక్స్, నోట్ బుక్స్ యూనిఫామ్స్, బెడ్ షీట్లు, కార్పెట్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర సామగ్రి సమకూర్చుకునేందుకు కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా సీఎస్.. అధికారులను ఆదేశించారు. అలానే విద్యార్థులకు అందించే సరుకుల క్వాలిటీ విషయంలో రాజీపడొద్దని సీఎం ఆదేశించారని.. తదనుగుణంగా అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సీఎస్ సూచించారు.
వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే.. కాస్మెటిక్ ఛార్జీలను నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. దీన్ని అమలు చేసేందుకు తగు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకోసం డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించడం వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు.
విద్యార్థులు తమకు కావాల్సిన కాస్మెటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయకేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. దీని వల్ల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదని.. నగదు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమవుతుందని వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa