ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో 2 కొత్త రైల్వే స్టేషన్లు.., అక్కడ్నుంచే కొత్త ట్రైన్లు..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 07:47 PM

హైదరాబాద్ నగరంలో అనేక రైల్వే స్టేషన్లు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. ఇవి నగరానికి, ఇతర ప్రాంతాలకు రైలు కనెక్టివిటీని అందిచేందుకు దోహదపడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి స్టేషన్, కాచిగూడ స్టేషన్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లు కాగా.. ఇటీవల చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి వచ్చింది. రూ. 450 కోట్లకు పైగా వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ్నుంచే అనేక ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా.. లింగంపల్లి, బేగంపేట, మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల నుంచి కూడా ట్రైన్లు రాకపోకలు సాగిస్తుంటాయి. తాజాగా నగరంలో మరో రెండు రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.


చర్లపల్లి-మౌలాలి-బొల్లారం మార్గంలో ఆర్కేనగర్, దయానంద్‌నగర్‌లో కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రెండు స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అధికారులతో కలిసి ఈ స్టేషన్లను పరిశీలించారు. ఈ స్టేషన్లు అందుబాటులోకి వచ్చా.. ఆర్కేనగర్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం 21 కోచ్‌లకు సరిపడా ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తున్నారు. ప్రయాణికులు అదనంగా ఆదిలాబాద్-తిరుపతి, విశాఖపట్నం-నాందేడ్, నర్సాపూర్-నాగర్‌సోల్, విశాఖపట్నం-షిర్డీ సాయినగర్, నాగావళి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ఈ స్టేషన్లలో ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


మరోవైపు, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడకు మళ్లించారు. ఈ రైలును మల్కాజ్‌గిరి స్టేషన్‌లో ఆపితే ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. అలాగే, చర్లపల్లి నుంచి మేడ్చల్, ఉందానగర్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి మీదుగా లింగంపల్లికి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లను, ముఖ్యంగా రద్దీ సమయాల్లో చర్లపల్లి నుండి లింగంపల్లికి రెండు ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని కూడా ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మల్కాజ్‌గిరి పశ్చిమ ప్రాంతం నుండి చర్లపల్లికి మరిన్ని బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ అధికారులను స్థానికులు కోరుతున్నారు. తద్వారా ఈ ప్రాంతాల నుండి రైల్వే స్టేషన్లకు చేరుకోవడం మరింత సులభమవుతుందని అంటున్నారు. ఈ కొత్త స్టేషన్లు, అదనపు ట్రైన్లు స్థానిక ప్రాంతాల ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa