ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరంలో వైభవంగా సరస్వతీ పుష్కరాలు తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 15, 2025, 07:25 PM

తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సరస్వతీ పుష్కరాలు కావడంతో వీటికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది.రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయాన్నే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. వేలాదిగా తరలివచ్చిన భక్తులను చూడటం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది" అని తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి జీ తొలి పుణ్యస్నానం ఆచరించడం ఈ కార్యక్రమానికి మరింత పవిత్రతను చేకూర్చిందని మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సరస్వతీ ఘాట్‌ను అధికారికంగా ప్రారంభించి, సరస్వతీ దేవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.12 ఏళ్లకోసారి జరిగే ఈ పుష్కరాల కోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో బుధవారం రాత్రి 10:35 గంటలకు పుష్కరఘడియలు ప్రారంభమయ్యాయి. మే 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజూ ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు యాగాలు, సాయంత్రం 6:45 నుంచి 7:35 గంటల వరకు సరస్వతీ ఘాట్ వద్ద సరస్వతీ నవరత్న మాల హారతి నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 35 కోట్లు కేటాయించింది. ఘాట్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించారు. భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa