ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిర్యానీలో చచ్చిన బల్లి.. కస్టమర్ షాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 07:29 PM

బిర్యానీలో సిగరెట్ ముక్కలు, బొద్దింకలు రావటం సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటివి మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా అటువంటి ఘటనే మరొకటి చోటుచేసకుంది. హైదరాబాద్‌ శివారులోని ఓ ఫేమస్ రెస్టారెంట్ బిర్యానీలో చచ్చిన బల్లి ప్రత్యక్షమైంది. అది చూసిన కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని హోటల్‌కు వచ్చిన ఆ కస్టమర్‌కు ఒక్క క్షణం ప్రాణం ఆగిపోయినంత పనైంది. బిర్యానీలో బల్లి చూసిన ఆ కస్టమర్ ఇదేంటని హోటల్ యజమానికి ప్రశ్నించాడు. అయితే దీనికి ఆ యజమాని ఇచ్చిన సమాధానం విని ఫ్యూజులు ఎగిరిపోయాయ్.


వివరాల్లోకి వెళితే.. బ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి మే 15న సాగర్ రోడ్డులోని ఓ ఫేమస్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. బాగా ఆకలిగా ఉండటంతో బిర్యానీ ఆర్డర్ చేశాడు. వెయిటర్ బిర్యానీ సర్వ్ చేయగా.. కృష్ణారెడ్డి దాదాపు పూర్తిగా తినేశాడు. అయితే ప్లేట్ చివర్లో ఏదో వింత ఆకారం కనిపించింది. దాన్ని నిశితంగా పరిశీలించగా.. అది చచ్చిన బల్లి అని గుర్తించాడు. అది చూసిన కృష్ణారెడ్డి షాక్‌కు గురయ్యాడు. అతడికి ప్రాణం పోయినంత పనైంది.


వెంటనే ఈ విషయంపై రెస్టారెంట్ యజమానిని కృష్ణారెడ్డి నిలదీశాడు. అయితే.. యజమాని నిర్లక్ష్యంగా ఇచ్చిన సమాదానం మరింత షాక్‌కు గురి చేసింది. బిర్యానీలో బల్లి వచ్చిందని ఫిర్యాదు చేస్తే.. సదరు యజమాని 'అయితే ఏమవుతుంది ? బల్లి బాగా ఫ్రై అయ్యింది కదా... రుచిగా ఉంటుంది. తినండి' అని బదులిచ్చాడు. అంతేకాకుండా, 'ఏంచేసుకుంటారో చేసుకోండి' అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి వెంటనే డయల్ 100కు కాల్ చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న రెస్టారెంట్ యజమాని వెంటనే రెస్టారెంట్‌కు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.


కాగా, ఇటీవల కాలంలో ఆహారంలో నాణ్యత లోపించడం, పరిశుభ్రత పాటించకపోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మరొక రెస్టారెంట్‌లో బిర్యానీలో బొద్దింకలు కనిపించడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు ఆహార భద్రతపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com