హైదరాబాద్లో మెట్రో చార్జీలు పెరిగాయి. కొత్త చార్జీలు నేటి నుంచే అమలుల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా రూ.2 నుంచి గరిష్ఠంగా రూ.15 వరకు పెంచారు. గతంలో కనీస టికెట్ ధర రూ.10 ఉంటే ఇప్పుడు రూ.12, గరిష్ఠంగా రూ.60 ఉన్న టికెట్ రూ.75 అయింది. ప్రతి టికెట్పై 20 శాతం మేర అదనంగా పెంచారు. ఎల్అండ్టీ సంస్థ మాత్రం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా ధరలు పెంచారు. మెట్రో చార్జీల పెంపుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు, మెరుగైన రవాణా సౌకర్యాలను ముందుగా కల్పించాలని, ఆ తర్వాతే ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, మెట్రో ఛార్జీల పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు సీఎంకు లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మెట్రో రైలును లక్షలాది మంది ప్రజలు తమ ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థ ప్రజలకు చవకగా అందుబాటులో ఉండాలని, ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సింగపూర్, బెర్లిన్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాల్లో ప్రభుత్వ సబ్సిడీలతో ప్రజా రవాణా వ్యవస్థలు నడుస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. హైదరాబాద్ కూడా విశ్వనగరంగా ఎదగాలంటే ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఛార్జీల పెంపు వల్ల మెట్రో ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలకు మారే అవకాశం ఉందని, ఇది నగరంలో ట్రాఫిక్, కాలుష్య సమస్యలను మరింత పెంచుతుందని వారు హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa