హైదరాబాద్లోని పాతబస్తీ, మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరగడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలంలో ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది కన్నుమూశారు. ఈ ఘోర దుర్ఘటనలో మొత్తం మరణాల సంఖ్య 17కు చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 30 మంది ఉండగా, 17 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్మార్ట్ చేసిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలు ఈ దుఃఖం నుండి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం బాధితులకు తక్షణ సహాయం అందిస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 17 మంది మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
చార్మినార్ సమీపం ఉదయం 06:16 గంటల ప్రాంతంలో గుల్జార్ హౌస్ చౌరస్తాలో ఉన్న G+2 భవనంలో మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. మొఘల్పురా అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఆ భవనం G+2 అంతస్తుల సముదాయం. మంటలు మొదట గ్రౌండ్ ఫ్లోర్లో ప్రారంభమై, క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లను అత్యంత వేగంగా ప్రారంభించారు. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని సిబ్బంది సాహసోపేతంగా రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు.. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో పహ్లాద్, మున్నీ, రాజేంద్ర మోడీ, సుమిత్ర, హామీ, అభిషేక్, శీతల్, ప్రియాన్ష్, ఇరాజ్, అరుషి, రిషబ్, ప్రథమ్, అనుయన్, వర్ష, పంకజ్, రజని , ఇద్దు ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక కేంద్రాల నుండి 12 అగ్నిమాపక పరికరాలతో సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 11 వాహనాలు, ఒక అగ్నిమాపక రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు మరియు 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడానికి.. చిక్కుకున్న వారిని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. అధికారులు.. సిబ్బంది చిక్కుకున్న వారిని రక్షించడానికి, మంటలను ఆర్పడానికి.. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ సహాయక చర్యలలో ఆధునిక సాంకేతిక పరికరాలైన అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్ .. బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ను కూడా ఉపయోగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa