సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నర్రెడ్డిగూడెంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..... నర్రెడ్డిగూడెంకు చెందిన అక్కాతమ్ముడు ఏకవాణి (14), మణివర్మ (10) స్థానికంగా ఉన్న మైదానంలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో నవ్యనగర్కు చెందిన యువతి కారులో డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉండగా, అదుపు తప్పిన వాహనం వేగంగా దూసుకొచ్చి ఆడుకుంటున్న చిన్నారులను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మణివర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఏకవాణికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన ఏకవాణిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, డ్రైవింగ్ చేస్తున్న యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు ప్రమాదానికి గురికావడంతో వారి కుటుంబంలో, నర్రెడ్డిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |