ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే చోట 10 మృతదేహాలు,,,,కొత్త ఇంట్లోకి విగతజీవులై వచ్చారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:19 PM

హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌లో ఆదివారం (మే 18) ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించారు, వీరిలో 8 మంది పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద అగ్నిప్రమాదంగా ఈ ఘటన నిలిచింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. ప్రహ్లాద్ మోదీ అనే ముత్యాల వ్యాపారి రెండు అంతస్తుల భవనంలోని నివసిస్తుండగా.. అనుకోని ప్రమాదంలో ఆయన కుటుంబం మెుత్తం విగతజీవులుగా మారారు. అయితే ఈ ఘటనలో మరో బాధాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.


కొన్ని రోజుల్లోనే కొత్తింట్లోకి వెళ్లాల్సి ఉండగా.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. సంతోషంగా కొత్తింట్లోకి వెళ్దామనుకున్న వారు విగతజీవులుగా వెళ్లాల్సి వచ్చింది. ప్రహ్లాద్ మోదీ చాలా ఏళ్లుగా పాతబస్తీలోనే ముత్యాల వ్యాపారం చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన ఇల్లు ఇరుకుగా ఉండటం, ఇద్దరు కుమారుల పెళ్లిళ్లు జరిగి కుటుంబాలు పెద్దవి కావటంతో మూడేళ్ల క్రితం అత్తాపూర్‌లోని ఉప్పర్‌పల్లిలో ఒక పెద్ద భవంతిని నిర్మించారు. ఇప్పటికే కింది అంతస్తులో పెద్ద కుమారుడు తన కుటుంబంతో నివసిస్తుండగా.. రెండో అంతస్తులో ఇంటీరియర్ పనులు పూర్తయ్యాయి. త్వరలో కుటుంబం మొత్తం కొత్త ఇంట్లోకి మారాలని అనుకున్నారు.


అయితే, విధి వక్రీకరించడంతో కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య మున్నీబాయి, చిన్న కుమారుడు పంకజ్ మోదీ, కోడలు వర్షా మోదీ, మనవడు ఇరాజ్, మనవరాళ్లు అనన్య, ఇదిక, ప్రహ్లాద్ మోదీ సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీ, ఆయన భార్య సుమిత్ర, ప్రహ్లాద్ మరో సోదరుడి కుమారుడు అభిషేక్ మోదీ ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతదేహాలను ఉప్పర్‌పల్లిలోని కొత్త ఇంటికి తీసుకురాగా.. ఆ దృశ్యం చూసిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. సంతోషంగా ఇంట్లోకి రావాల్సిన వారు.. విగతజీవులుగా వచ్చారంటూ కన్నీరు పెట్టుకున్నారు. కొత్త ఇంటి ఆనందం కళ్లముందే ఆవిరైపోవడంతో స్థానికులు సైతం తీవ్రంగా కలత చెందారు. అయ్యో దేవుడా.. ఏంటయ్యా ఈ దారుణం అంటూ కన్నీరు పెట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com