ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు మే 27కే రుతుపవనాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:25 PM

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రాన్ని తాకనున్నాయి. తొలకరి పలకరింపు అనుకున్నదానికంటే ముందే ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళలో నైరుతి రుతుపవనాలు మే 27 నాటికి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలోకి జూన్ మెుదటి వారంలోనే రుతు పవనాలు ప్రవేశిస్తాయన్నారు. ఇక ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రోజుల్లో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తుపాను తరహాలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు.


ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతారణ శాఖ అధికారిణి కె. నాగరత్న వెల్లడించారు. రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. దీని కారణంగా పగటి ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందన్నారు.


నేడు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. రేపు (మే 20) పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందను ఈ నెలాఖరు నాటికి ఎండలు తగ్గనున్నాయి.


ఇక ఆదివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. కొండాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ వంటి చోట్ల వర్షం పడటంతో రోడ్లపై నీరు నిలిచింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బెంగళూరు నగరాన్ని అతలాకుతలం చేసింది. గత 24 గంటల్లో నగరంలో దాదాపు 40 మిమీ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి సామాన్లు నీట మునిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com