ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ సిటీ అంతటా.. ఫారెన్ రేంజ్‌లో.. భూగర్భ కేబుల్ వ్యవస్థ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:31 PM

హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం వచ్చినా.. ఈదురుగాలులు వచ్చినా కరెంట్ పోతుంది. లేకపోతే పెద్ద ప్రమాదం వస్తుందన్న కారణంగా అధికారులు ఈ విద్యుత్ సరఫరాను ఆపేస్తారు. ఇలా పదే పదే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దే ప్రయత్నాల్లో భాగంగా.. విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది.


భూగర్భ కేబుల్స్ ద్వారా విద్యుత్ అంతరాయాలను నివారించడంతో పాటు.. విద్యుత్ నష్టాలు, దొంగతనాలను అరికట్టడం.. ప్రకృతి వైపరీత్యాల నుంచి విద్యుత్ వ్యవస్థను రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. చార్మినార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో అధికంగా విద్యుత్ లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానంతో వీటన్నింటిక చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మొదట హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పూర్తిస్థాయి భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


ఈ ప్రాజెక్ట్ మేడ్చల్ జిల్లా నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవస్థ ఏర్పాటుకు కిలోమీటరుకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 1,280 కిలోమీటర్ల మేర 33 కెవి భూగర్భ కేబుల్స్ ఉండగా.. దీనిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భూగర్భ విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేసిన విదేశీ నగరాల విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణను విద్యుత్ రంగంలో అనుభవం ఉన్న సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా హైదరాబాద్‌ను విద్యుత్ సమస్యలు లేని.. అత్యాధునిక నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.


ప్రతీ ఏడాది నగరంలో విద్యుత్ డిమాండ్ అధికంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డేటా సెంటర్లు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రాంతీయ రింగ్ రోడ్డు పరిధిలోని రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు అవసరమైన విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.


భవిష్యత్తులో నిర్మించబోయే నగరంలో(ఫ్యూచర్ సిటీలో) విద్యుత్ టవర్లు, స్తంభాలు లేకుండా భూగర్భంలోనే విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే.. నగరంలోని సచివాలయం, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి కీలక ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. ఓఆర్ఆర్ వెంబడి సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com