తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కార్మికుల సంక్షేమం, భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ నిబద్ధతను చాటుతూ.. విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడిన ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నేడు ప్రజాభవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ కార్మికుల కుటుంబాలకు ఈ భారీ బీమా మొత్తాన్ని అందజేసింది.
ఎన్పీడీసీఎల్ (నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్) పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అంతేకాకుండా.. విద్యుత్ శాఖలో ప్రాణాలు కోల్పోయిన మరో కార్మికుడు రమేశ్ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులను కూడా ఈ సందర్భంగా అందజేసి, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైందని ఉద్ఘాటించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా కార్మికుల కోసం ఇంత గొప్పగా ఆలోచన చేయలేదని.. ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ఈ ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రవేశపెట్టిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. అక్కడ విజయం సాధించిన ఈ పథకాన్ని ఇప్పుడు విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకురావడం ద్వారా.. కార్మికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. కోటి రూపాయల పైబడిన ప్రమాద బీమా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులందరిలో ఒక కొత్త భరోసాను నింపుతుందని.. వారు మరింత అంకితభావంతో పనిచేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.
విద్యుత్ ఉద్యోగులు ఈ కొత్త భరోసాతో మరింత అంకితభావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్పీడీసీఎల్ (NPDCL)సీఎండీ వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని, వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇటీవల గిగ్ వర్కర్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa