ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు శుభవార్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 06:43 PM

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించగా.. మరో పది రోజుల్లో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోనూ నిధులు జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వ రైతుబంధు పథకం స్థానంలో రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు హామీ ఇచ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో.. ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని తర్వాత ప్రకటించింది. ఈ నిధులను ఎకరాకు రూ.6 వేలు చొప్పున రెండు విడతలుగా (ఖరీఫ్, రబీ) రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.


ఇప్పటివరకు.. 3.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సుమారు రూ. 4,000 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. తాజా ప్రకటనతో.. భూమి పరిమితిని పెంచడం ద్వారా మరింత మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. అంటే దాదాపు 4 ఎకరాల నుంచి 10 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఈ నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్రంలోని సన్నకారు, చిన్నకారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి.. పంట పెట్టుబడులకు చేయూతనిస్తుంది.


రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా కల్పించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా.. వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.


అంతేకాకుండా.. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు త్వరలోనే ఆయిల్ పామ్ మిల్లును ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. రైతులు సాంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్నలకే పరిమితం కాకుండా.. మార్కెట్ డిమాండ్ ఉన్న కొత్త పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్, ఇతర ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని, దీనికి అవసరమైన సాంకేతిక సాయం, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, వ్యవసాయ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa