ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల కోసం రేవంత్ సర్కార్ కొత్త పథకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 08:06 PM

తెలంగాణలోని మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. వారి కోసం త్వరలోనే కొత్త పథకాన్ని తీసుకొస్తామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో పతాకావిష్కరణ చేసిన ఆయన.. అనంతరం ప్రభుత్వ ప్రగతి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


మహిళల కోసం త్వరలోనే కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రానున్న రోజుల్లో క్యూఆర్ కోడ్ కార్డుల ద్వారా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది తమ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని, ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం తెలిపారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు సాయం చేస్తున్నామని గుర్తు చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, ప్రస్తుతం రూ.2.75 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని సీఎం అన్నారు.


దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు భూ సమస్యలు లేకుండా చేసేందుకు 'భూభారతి'ని అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ చట్టమైందని ఆయన అభివర్ణించారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, అధికారులు నేరుగా అన్నదాతల ఇళ్లకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.


దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, పెట్టుబడుల ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల విశ్వాసాన్ని చూరగొన్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో కోట్లలో యువత ఉన్నా ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు, క్రీడా రంగంలోనూ రాణించడానికి యువతకు ప్రోత్సాహం అందిస్తామని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa