ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో వీరికి మాత్రమే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 07:52 PM

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇది కేవలం ఒక తాత్కాలిక కార్యక్రమం కాదని.. నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న పేదలందరికీ మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేశామని.. వీరిలో కూడా ఇంకా అందరికీ ఇవ్వలేదని.. త్వరలోనే వారికి కూడా మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. ఇక దరఖాస్తు చేసుకొని అర్హులైన మిగిలిన లబ్ధిదారులెవరూ నిరాశ చెందవద్దని, ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని.. వచ్చే ఏడాది రెండవ విడతలో భాగంగా వారికి కూడా అవకాశాలు లభిస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు.


ఖమ్మం జిల్లాలోని టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో.. ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌లతో కలిసి మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా.. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూసి తాను భావోద్వేగానికి లోనయ్యానని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు నిజంగా ఉపయోగపడే పనులు చేస్తే వారి నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని ఆయన అన్నారు.


గత పాలకుల విధానాలపై విమర్శలు గుప్పించిన మంత్రి.. వారు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాలపై చూపిన శ్రద్ధను పేద ప్రజల ఇళ్లపై పెట్టలేదని.. వారి సొంతింటి కలను విస్మరించారని ఆరోపించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని తమ అజెండాగా చేసుకుందని.. ఈ సంవత్సరం పేద ప్రజల సొంతింటి కల కోసం రూ.22 వేల 500 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పేదల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.


ఇందిరమ్మ ఇళ్ల పథకం పారదర్శకంగా అమలు కావాలని, ఎక్కడ కూడా లంచాలకు ఆస్కారం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ప్రకటించారు.


ఎంత పని చేసింది.. ఇందిరమ్మ ఇంటి ఆశ.. అరచేతిపై నోట్ రాసుకొని..


ప్రభుత్వం పేదల ఇళ్లతో పాటు రైతు సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి గుర్తు చేశారు. రైతుల కోసం దాదాపు రూ.21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 రూపాయల బోనస్ అందించామని వివరించారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ఎకరానికి రూ.12 వేల రూపాయలకు పెంచామని, తద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని అన్నారు.


ప్రస్తుతం ఏదులాపురం మున్సిపాలిటీలో 520 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు.. ఇంకా అర్హులున్నారని, వారికి కూడా దశలవారీగా అందజేస్తామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు మంజూరు కాలేదని.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహాయంతో తమకు ఇళ్లు మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణలో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa