హైదరాబాద్ నగరంలోని నిజాంపేట పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో బుధవారం తీవ్ర కలకలం రేగింది. ఒక ట్రావెల్ బ్యాగ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా భయాందోళనలకు దారి తీసింది.బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఒక సూట్కేసు పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. దాని నుంచి దుర్వాసన వెలువడుతుండటంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు ఆ సూట్కేసును తెరిచి చూడగా, అందులో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు మెరూన్ రంగు చుడీదార్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa