ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు (ఏ 1)గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈరోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ఏడాది మార్చి 10న ఆయనపై కేసు నమోదు అయింది. కేసు నమోదు కాగానే, మరుసటి రోజే ఆయన మూడు నెలల కాలపరిమితి వీసాపై అమెరికా వెళ్లి తిరిగి రాలేదు. హైదరాబాద్ తిరిగి వస్తే ఈ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో అమెరికాలో ఉండిపోయేందుకు ప్రభాకరరావు ప్రయత్నించారు. అయితే అమెరికా న్యాయస్థానంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ న్యాయస్థానాల్లోనూ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకపోయింది.సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి మినహాయింపు ఉత్తర్వులు ఇస్తూ, సిట్ విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పాస్పోర్ట్ పునరుద్ధరించాలని ఆదేశించడంతో పాటు, అమెరికా నుంచి వచ్చిన మూడు రోజుల్లో విచారణ అధికారి ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.ఈ క్రమంలోనే అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ అయింది. దీంతో ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు ఉత్తర్వులు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa