తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలోనే ఉన్న ఆయన.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇప్పటి వరకు యూఎస్లో ఉన్న ప్రభాకర్ రావు .. జూన్ 10లోపు విచారణకు హాజరవుతానని పోలీసులకు గతంలోనే తెలిపారు. దీంతో ఆదివారం (జూన్ 8) ఎమిరేట్స్ ఫ్లైట్లో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభాకర్ రావుపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ జరిగింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ అధికారికి సమాచారం ఇవ్వగా.. క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ప్రాసెస్ మొదలుపెట్టారు.
ఇవాళ జూబ్లీహిల్స్లోని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ముందు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆయన కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంపై, అలాగే ఎంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని మాసబ్ట్యాంక్ నుండి మళ్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మార్చారు. గత రెండు నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుండి సిట్ పనిచేసింది. ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కార్యాలయ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే విచారణ తర్వాత ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ ఉత్కంఠ రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa