సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ తమ ఆధార్ కార్డులో వివరాలను, బయోమెట్రిక్లను తప్పకుండా అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా , ఎస్పీ మహేష్బీగీతే కోరారు. ఇటీవల కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పౌరులందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ప్రసవాల వివరాలను ఈ-బర్త్ పోర్టల్లో నమోదు చేయాలని కోరారు. ప్రతి 10 వేల జనాభాకు ఒక కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ఏర్పాటు చేయాలని, త్వరలో మరో 36 CSC కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ప్రస్తుతం ఉన్న కొన్ని సెంటర్లను మార్చాలని సూచించారు.
జిల్లాలో 5 నుండి 15 సంవత్సరాలలోపు ఉన్న 27 వేలకు పైగా జనాభాకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని కలెక్టర్, ఎస్పీ ఉద్ఘాటించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక అవగాహన క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా సంక్షేమాధికారి మాట్లాడుతూ.. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ కార్డులు అందేలా చూడాలన్నారు. 18 సంవత్సరాలు దాటిన వారికి ఆధార్ నమోదుకు సంబంధించి తహసీల్దార్ లాగిన్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కోరారు. మండల కేంద్రాల్లో ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో మీ సేవా కేంద్రాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్టల్ కార్యాలయం నుంచి ఎన్ని ఆధార్ కార్డులు తప్పుడు చిరునామాల కారణంగా వెనక్కి వచ్చాయో వివరాలు అందించాలన్నారు. జిల్లాలోని వివిధ అనాథ శరణాలయాల్లో పెరుగుతున్న వారికి ఆధార్ నమోదులో వచ్చే సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ సమావేశంలో యూఐడీఏఐ ప్రాజెక్టు మేనేజర్ నరేష్ చంద్ర, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత, ఈడీఎం శ్రీనివాస్, లీడ్బ్యాంక్ మేనేజర్ మల్లిఖార్జున్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమన్వయ ప్రయత్నం ద్వారా సిరిసిల్ల జిల్లాలో ఆధార్ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువవుతాయని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa