ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాలెట్‌లో కూడా ‘నోటా’,,,,ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 08:44 PM

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మనకు ఎవరూ నచ్చకపోతే.. నోటాకు ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈవీఎంలలో మాత్రమే నోటాకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కానీ ఇకపై బ్యాలెట్‌ పేపర్ల మీద కూడా నోటాను ముద్రించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. త్వరలోనే తెలంగాణలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే బ్యాలెట్ పత్రాల్లో నోటా అందుబాటులోకి రానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నిర్వహించబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహిస్తుండగా.. దీనిలో నోటాను ముద్రించేలా ఎన్నికలు సంఘం ఆదేశాలు జారీ చేసింది.


ఇప్పటికే అధికారులు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ బాక్సులు, సిబ్బంది నియామకం వంటి అంశాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు ఒకేసారి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో జడ్పీటీసీ కోసం తెలుపు రంగులో, ఎంపీటీసీల కోసం గులాబీ రంగులోసభ్యుల బ్యాలెట్‌ ఉండేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేశారు.


స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపై స్పష్టత వచ్చింది. అలానే నియోజకవర్గాల వారీగా ఓటర్ల విభజన పూర్తి చేశారు. పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారితో పాటు మరో నలుగురు సిబ్బందిని నియమిస్తూ వారికి శిక్షణ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. అలానే ఓటరు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇద్దరు సభ్యులకు ఒకే రోజు ఓటు వేయాల్సి ఉంది. దీనిలో భాగంగా ముందుగా ఓటరుకు ఎంపీటీసీ అభ్యర్థికి ఓటు వేసేలా బ్యాలెట్‌ ఇస్తారు. ఆ తరువాత అదే గదిలో జడ్పీటీసీ క్యాండెట్‌కు ఓటు వేసేందుకు బ్యాలెట్‌ పత్రం అందిస్తారు. ఇలా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇద్దరు అభ్యర్థులకు రెండు ఓట్లు వేశాకే.. ఓటరు పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.


స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌లో పోటీ చేసే అభ్యర్థి వయసు 21ఏళ్లు నిండి ఉండాలి. పోటీకి కనీసం ఒకరోజు ముందే బ్యాంకు అకౌంట్ తెరవాలి. ఆ ఖాతా నుంచే ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు చేస్తున్నట్లుగా.. సదరు అభ్యర్థి నామినేషన్ వేసిన రోజున రిటర్నింగ్‌ అధికారికి రాతపూర్వకంగా తెలపాలి. 2018 పంచాయతీరాజ్‌ చట్టం 243(3) ప్రకారం ఒక అభ్యర్థి ఎంపీటీసీ, జడ్పీటీసీకి పోటీ చేస్తున్న స్థానాలు ఒకటి కంటే ఎక్కువ ఉండరాదు. ఎవరైనా అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేస్తున్నట్లు గుర్తిస్తే.. వారి నామినేషన్లను రెండు చోట్ల తిరస్కరించే అవకాశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa