తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలవుతోందని రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు. ఇప్పటివరకు 1.74 లక్షల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాన్ని ప్రారంభించారని, వీరిలో 57,000 ఇండ్లు బేస్మెంట్ దశను పూర్తి చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం అత్యంత పేదలకు ఆవాస హక్కును కల్పించడమని గౌతం స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులకు రూ. 386.12 కోట్లు విడుదల చేసిందని, ప్రతి సోమవారం నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు గౌతం తెలిపారు. ఈ వారంలోనే రూ. 115 కోట్లు చెల్లించినట్లు ఆయన వివరించారు. 5,000 ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, నిర్మాణ దశలో వివిధ దశల్లో ఉన్న ఇతర ఇండ్లు త్వరలో పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అర్హుల ఎంపికలో పారదర్శకతను నిర్ధారించేందుకు 360 డిగ్రీల పరిశీలన విధానాన్ని అనుసరిస్తున్నట్లు గౌతం తెలిపారు. 12,700 మందిలో 10,700 మంది అర్హులుగా నిర్ధారణ అయ్యారని, 1,950 మంది అనర్హులుగా తేలారని వెల్లడించారు. అనర్హుల స్థానంలో కొత్త అర్హులను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
20 వేల మంది లబ్ధిదారుల ఇండ్లు రద్దు చేసినట్లు వస్తున్న ఆరోపణలను గౌతం ఖండించారు. ప్రతి లబ్ధిదారునికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం పురోగతి రాష్ట్రంలో నిరుపేదలకు గృహ సౌకర్యం కల్పించే దిశగా గణనీయమైన అడుగుగా నిలుస్తోందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa